
MI vs LSG: ఐపీఎల్ 2025లో 45వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ను 54 పరుగుల తేడాతో ఓడించింది ఎంఐ. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై టీం వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు ముందుకు దూసుకెళ్లింది... 12 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.
ముంబై టీం మొత్తం 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు, 4 ఓటములు నమోదు చేసింది. లక్నోపై ఎంఐ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఆటగాళ్లందరూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో ఈ జట్టు లక్నోను ఓడించగలిగింది.
ముంబై, లక్నో మ్యాచ్లో చాలా పెద్ద రికార్డులు నమోదయ్యాయి. ముంబై టీం బ్యాట్తో, బాల్తో అదరగొట్టారు. ఈ రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్ ఐపీఎల్ 2025కి థ్రిల్ను జోడించింది. ముంబై లక్నోపై సాధించిన విజయంతో సృష్టించిన 3 పెద్ద రికార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపుబ్యాటింగ్ తో సాధించిన రికార్డ్ గురించి తెలుసుకుందాం. సూర్య అద్భుతంగా ఆడి 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 192.86. ఈ ఇన్నింగ్స్తో అతను ఐపీఎల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేశాడు.
ఇలా వేగంగా 4000 వేల పరుగులు సాధించిన భారతీయ బ్యాట్స్మన్ గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న భారతీయ బ్యాట్స్మన్ సూర్య. అతడు కేవలం 2714 బంతుల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో 2881 బంతుల్లో ఇదే స్కోరు సాధించిన సురేష్ రైనా రికార్డును అతను బద్దలు కొట్టాడు.
జస్ప్రీత్ బుమ్రా పేరిట మరో రికార్డు నమోదయ్యింది. బుల్లెట్ లాంటి బంతులతో లక్నో సూపర్ జాయింట్స్ కు చుక్కలు చూపించాడు బుమ్రా. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ 5.50. బుమ్రా 139 మ్యాచ్లలో 22 సగటు, 8 ఎకానమీ రేటుతో ముంబై తరపున 171 వికెట్లు తీసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉంది. మలింగ 122 మ్యాచ్లలో 170 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు MI కొత్త హీరో బుమ్రా అయ్యాడు. రాబోయే కాలంలో అతను మరిన్ని రికార్డులు సృష్టించవచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో 150వ విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్లో ఎల్ఎస్జీని 54 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ ఘనత సాధించిన మొదటి జట్టు కూడా ఇదే. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఏ జట్టు కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. ఎంఐ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 140 విజయాలు, కోల్కతా నైట్ రైడర్స్ 134, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 129, ఢిల్లీ క్యాపిటల్స్ 121 విజయాలు సాధించాయి.