
చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అంటే క్రేజ్ మాములుగా ఉండదు. మిగిలిన క్రీడలను పక్కనబెడితే క్రికెట్ అంటే రెండు దేశాల్లో క్రికెట్ ను మరో మతంలా కొలుస్తున్న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇక దానిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఆదివారం రాత్రి ఆ మజాను ఆస్వాదించడానికి ఇరు దేశాల క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్-2022లో భాగంగా జరుగాల్సి ఉన్న ఈ మెగా పోరులో టీ20లలో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో 14 మ్యాచులు జరిగాయి. ఇందులో భారత్ 8 మ్యాచుల్లో గెలవగా.. పాకిస్తాన్ 5 సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లకు సంబంధించిన పలు రికార్డులు మీకోసం..
- ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ - 2022 15వ ఎడిషన్. గతంలో దీనిని వన్డే ఫార్మాట్ లో నిర్వహించినా తర్వాత వన్డే లేదా టీ20 ప్రపంచకప్ ముందు నిర్వహిస్తే దానికనుగుణంగా ఈ మెగా టోర్నీని జరుపుతారు. అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఉన్నందున ఇప్పుడు టోర్నీని టీ20 ఫార్మాట్ లో జరుపుతున్నారు. ఇందులో భాగంగా 2016లో నిర్వహించిన టీ20 మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది. అంతేగాక ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మూడు మ్యాచులలో భారత్ దే గెలుపు. ఆసియా కప్ లో చివరిసారి పాకిస్తాన్.. 2014లో భారత్ పై నెగ్గింది.
- ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక టీ20లో భారత్ విజయం సాధించింది. అయితే రెండు జట్ల నడుమ ఇప్పటివరకు 9 టీ20లు జరుగగా.. అందులో భారత్ 6 గెలిచింది. పాకిస్తాన్ 2 నెగ్గింది. ఒకటి టై అయింది.
- ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్.. షోయభ్ మాలిక్ - ఆరు ఇన్నింగ్స్ లలో 432 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ (8 ఇన్నింగ్స్ లలో 367 పరుగులు), మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (4 ఇన్నింగ్స్ లలో 255 పరుగులు) ఉన్నారు.
- అత్యధిక వికెట్లు తీసినవారిలో సయీద్ అజ్మల్ - నాలుగు ఇన్నింగ్స్ లలో 8 వికెట్లు ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్ లలో ఏడు వికెట్లు తీశాడు అనిల్ కుంబ్లే.
-రెండు దేశాల మధ్య అత్యధిక స్కోరు : ఇండియా.. 330-4 (2012లో)
- అత్యల్ప స్కోరు : ఇండియా (169 ఆలౌట్.. 1995లో) పాకిస్తాన్ (83 ఆలౌట్.. 2016లో)