NZ Tour Of India: వచ్చే ఏడాది భారత జట్టు జనవరిలో న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టు పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నది.
ఇటీవలే భారత్ ను వన్డే సిరీస్ లో ఓడించిన న్యూజిలాండ్ త్వరలోనే ఇండియా టూర్ కు రానున్నది. ఈ టూర్ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆదివారం వన్డే జట్టును ప్రకటించింది. టీ20 జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే వన్డే జట్టులో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ తో పాటు స్టార్ పేసర్ టిమ్ సౌథీ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ లేకుండానే బరిలోకి దిగుతున్నది. ఈ ముగ్గురూ భారత్ కంటే ముందు పాకిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొని అట్నుంచి అటే న్యూజిలాండ్ కు తిరిగి వెళ్లిపోతారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
జనవరిలో భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్... టీమిండియాతో తొలుత మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 18, 21, 24 తేదీలలో వన్డేలు జరుగుతాయి. అనంతరం జనవరి 27, 29 ఫిబ్రవరి 01 న టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ మేరకు ఇదివరకే వేదికలు కూడా ఖరారుచేసింది బీసీసీఐ.
అయితే భారత్ కు రావడానికంటే ముందు న్యూజిలాండ్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. పాకిస్తాన్ తో జనవరి 10, 12, 14 న మూడు వన్డేలు ఆడుతుంది. ఈ సిరీస్ కు కేన్ విలియమ్సన్ తో పాటు టిమ్ సౌథీ, కోచ్ గ్యారీ స్టెడ్ అందుబాటులో ఉంటారు. పాక్ తో మూడు వన్డేలు ముగిసిన తర్వాత ఈ ముగ్గురూ భారత పర్యటనకు రాకుండా కివీస్ కే వెళ్లిపోతారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గ్యారీ స్టెడ్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ లూక్ రోంచి హెడ్ కోచ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. భారత్ తో వన్డేలకు టామ్ లాథమ్ సారథిగా వ్యవహరించనున్నాడు. 17 మంది తో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
భారత్ తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు :
టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి
అయితే కేన్ మామతో పాటు టిమ్ సౌథీ పాకిస్తాన్ సిరీస్ కు వచ్చి భారత సిరీస్ కు దూరంగా ఉండటానికి కారణాలను వివరిస్తూ.. వచ్చే మార్చిలో ఇంగ్లాండ్ జట్టు కివీస్ కు రానుంది. టెస్టులలో సన్నద్ధమయ్యేందుకు గాను ఆ ఇద్దరికీ రెస్ట్ ఇచ్చినట్టు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.