న్యూజిలాండ్ పై జరిగిన వన్డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయకపోవడంపై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. బుమ్రా బౌలింగును ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని జహీర్ ఖాన్ చెప్పాడు.
ఢిల్లీ: న్యూజిలాండ్ పై జరిగిన వన్డే సిరీస్ లో ఘోరంగా విఫలమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అండగా నిలిచాడు. అతి తక్కువ సమయంలోనే బుమ్రా ఓ కీలకమైన బౌలర్ గా అవతరించాడని, బుమ్రా బౌలింగ్ ను ఆడాలంటే ప్రత్యర్థి జట్లలో వణుకు పుడుతోందని ఆయన అన్నాడు. బుమ్రా తన ప్రత్యేకతను చాటుకుంటా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడని ఆయన అన్నాడు.
బుమ్రా తన బౌలింగ్ విషయంలో మాత్రం ఒక్కటి గమనించకతప్పదని అన్నాడు. బుమ్రా బౌలింగ్ లో రిథమ్ తగ్గలేదని, కానీ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బుమ్రాను జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకుని బరిలోకి దిగుతున్నారని, దాంతో బుమ్రా బౌలింగ్ ను ఆచితూచి ఆడుతున్నారని ఆయన విశ్లేషించాడు. అదే సమయంలో మిగతా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పాడు.
Also Read: బుమ్రాను అంటారేమిటి, మరి కోహ్లీ సంగతేమిటి: ఆశిష్ నెహ్రా
అందువల్ల బుమ్రాకు వికెట్లను సాధించడం కష్టమవుతోందని, ఈ స్థితిలో బుమ్రా తన బౌలింగుకు మరింత పదును పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నాడు. తన బౌలింగును ప్రత్యర్థి జట్టు క్రికెటర్లు రక్షణాత్మక ధోరణితో ఆడుతున్నారనే విషయం బుమ్రాకు కూడా తెలుసునని, దాంోత వికెట్లను ఏ విధంగా సాధించాలనే విషయంపై బుమ్రా దృష్టి సారించాలని ఆయన అన్నాడు.
బ్యాట్స్ మెన్ తప్పులు చేసే విధంగా తన బౌలింగుకు బుమ్రా మెరుగులు దిద్దుకోవాలని సూచించాడు. బుమ్రా బౌలింగును జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు ఇవ్వకుండా ఉండడానికి ప్రత్యర్థి జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నాడు. దానిపై బుమ్రా దృష్టి సారించి మరింత దూకుడుగా బౌలింగ్ చేసి వారిని ఇబ్బంది పెట్టాలని ఆయన అన్నాడు.
Also Read: కివీస్ పై చెత్త ప్రదర్శన: అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా