
టీమిండియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా పై ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు చెప్పేవన్నీ అబద్దాలని వ్యాఖ్యానించాడు. గుజరాత్ జట్టు ఫైనల్ నెగ్గిన అనంతరం ఈ ఇద్దరూ సరదాగా చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా జట్టు క్రెడిట్ అంతా తనకే ఇచ్చిన పాండ్యా వ్యాఖ్యలకు బదులుగా నెహ్రా.. అలాంటిదేమీ లేదని, అతడు చెప్పేవన్నీ అబద్దాలని తేల్చేశాడు.
ఐపీఎల్ అధికారిక ఖాతాలో విడుదల చేసిన ఓ వీడియోలో ఈ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ముందు పాండ్యా మాట్లాడుతూ.. ‘మనం మొదటి సీజన్ లోనే సిక్సర్ కొట్టాం. ఛాంపియన్ గా నిలిచాం.. మనం సీజన్ మొదలుపెట్టినప్పుడు చాలా మంది గుజరాత్ బ్యాటింగ్, బౌలింగ్ బలహీనంగా ఉందని అన్నారు..
కానీ ఇప్పుడు వాళ్లే మనం ట్రోఫీ గెలిచిన తర్వాత బ్యాటింగ్, బౌలింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ నాయకత్వం వల్లే. మీవల్లే ఆటగాళ్లందరూ చాలా విషయాలు నేర్చుకున్నారు..’ అని పాండ్యా అన్నాడు. దానికి నెహ్రా మధ్యలో కల్పించుకుని తాను చేసిందేమీ లేదని చెప్పాడు.
అనంతరం పాండ్యా స్పందిస్తూ.. ‘మేము ప్రాక్టీస్ కు వెళ్తే నెహ్రా మాతో మరికొద్దిసేపు ఎక్కువ ప్రాక్టీస్ చేయించేవాడు. సాధారణంగా 20 నిమిషాల్లో ప్రాక్టీస్ ముగుస్తుందనుకుంటే అందరూ ఇక బ్యాగ్ సర్దుకుని హోటల్ కు చెక్కేస్తారు. కానీ నెహ్రా అలా కాదు. ఆ 20 నిమిషాల్లో కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని అనేవాడు. మేము సీజన్ లో ఇలా ఆడామంటే దానికి కారణం కచ్చితంగా నెహ్రా కే చెందుతుంది..’ అని తెలిపాడు.
ఇక అప్పుడు నెహ్రా మళ్లీ అందుకుని.. ‘హే లేదు.. నేను చేసిందేమీ లేదు. పాండ్యా అబద్ధం చెబుతున్నాడు..’ అని నవ్వుతూ అక్కడ్నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
కాగా ఆదివారం నాటి మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. 18.1 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి ఆడిన తొలి సీజన్ లోనే ట్రోఫీని నెగ్గింది.