
IPL 2025 SRH vs GT: ఐపీఎల్ 2025 51వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడింది. శుక్రవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై జీటీ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోని హైదరాబాద్ టీమ్ 186-6 పరుగులు మాత్రమే చేసి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం లభించింది. ట్రావిస్ హెడ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో హైదరాబాద్ టీమ్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
జీటీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, ప్రసిద్ధ్ 2 వికెట్లు తీసుకున్నారు. మిగతా బౌలర్లు కూడా పరుగులు ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ టీమ్ 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి వచ్చింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 224/6 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ 37 బంతుల్లో 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.