
స్వంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. టాప్ - 3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 61, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (29 బంతుల్లో59, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) లు చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించారు. లక్నో బౌలర్లను చితకబాదారు. ఈ పనిని ముందు కోహ్లీ స్వీకరించగా మ్యాక్స్వెల్, డుప్లెసిస్ లు మిడిల్, ఫైనల్ ఓవర్స్ లలో దానిని పీక్స్ కు తీసుకెళ్లారు. ఈ ముగ్గురి వీరవిహారంతో ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మరి చిన్నస్వామి స్టేడియంలో లక్నో ఈ పెద్ద లక్ష్యాన్ని ఛేదిస్తుందా..?
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ఆర్సీబీకి శుభారంభం దక్కింది. కోహ్లీ - డుప్లెసిస్ లు తొలి వికెట్ కు 11.3 ఓవర్లలో 96 పరుగులు జోడించారు. ముఖ్యంగా కోహ్లీ అయితే రెండో ఓవర్లోనే బాదుడు స్టార్ట్ చేశాడు. అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో 6,4 కొట్టాడు. అతడే వేసిన నాలుగో ఓవర్లో రెండు బౌండరీలు సాధించాడు.
కోహ్లీ హాఫ్ సెంచరీ..
మార్క్ వుడ్ వేసిన 6 వ ఓవర్లో కోహ్లీ రెండో బంతికి ఫోర్ కొట్టి ఆర్సీబీ స్కోరును 50 పరుగులు దాటించాడు. అదే ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. రవి బిష్ణోయ్ వేసిన 9వ ఓవర్లో ద ఐదో బంతికి లాంగాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది రెండో అర్థ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ.. అమిత్ మిశ్రా వేసిన 11వ ఓవర్ లో మూడో బంతికి మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడి స్టోయినిస్ కు క్యాచ్ ఇచ్చాడు.
డుప్లెసిస్ - మ్యాక్స్వెల్ షో..
కోహ్లీ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ తో కలిసి డుప్లెసిస్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. రావడం రావడమే భారీ షాట్లతో విరుచుకుపడ్డ మ్యాక్స్వెల్.. మ్యాగ్జిమమ్ మెరుపులు మెరిపించాడు. మిశ్రా వేసిన 14వ ఓవర్లో మ్యాక్సి.. 4, 6 బాదాడు. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో డుప్లెసిస్ కూడా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన మరుసటి ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదిన డుప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉనద్కత్ వేసిన 18వ ఓవర్లో మ్యాక్స్వెల్ బౌండరీ కొట్టి డుప్లెసిస్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో డుప్లెసిస్.. 6, 6 , 4 తో ఆర్సీబీ స్కోరును 180 మార్క్ దాటించాడు. ఇక అవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో తొలి బంతికి మ్యాక్సి.. రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అతడికి ఈ సీజన్ లో తొలి అర్థ సెంచరీ పూర్తయింది. ఇదే ఓవర్లో డుప్లెసిస్ ఫోర్ తో ఆర్సీబీ స్కోరు 200 దాటింది. వుడ్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదో బంతికి మ్యాక్సీ ఔటయ్యాడు.