
భారత క్రికెట్ జట్టుకు క్రికెటర్లను అందించే కర్మాగారంగా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ సీజన్ లో మరో ఇద్దరు స్టార్లను అందజేసింది. ప్రతీ సీజన్ లోనూ కొత్త తారలను పరిచయం చేసే ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్.. ఈ ఏడాది ఇద్దరు యువ సంచలనాలను తీసుకొచ్చింది. ఆ ఇద్దరే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్, రాజస్తాన్ రాయల్స్ ఫినిషర్ ధ్రువ్ జురెల్. ఈ ఇద్దరూ నిన్న గువహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్క ప్రదర్శనతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి గురించే చర్చంతా.. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇద్దరూ ఎవరు..? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఐపీఎల్ లో అస్సలు నిలకడ లేని జట్టుగా ఉన్న పంజాబ్ కు చాలాకాలం తర్వాత సిసలైన ఓపెనర్ దొరికాడనే నమ్మకాన్ని ఇచ్చాడు ప్రభ్సిమ్రన్ సింగ్.. గత మూడు ఎడిషన్లుగా పంజాబ్ జట్టుతో ప్రయాణిస్తున్నా .. ఈ సీజన్ లోనే గుర్తింపు దక్కించుకున్నాడు.
ధావన్ ఉన్నా అతడి మీదే కన్ను..
2023 సీజన్ లో భాగంగా పంజాబ్.. కేకేఆర్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి తొలి రెండు ఓవర్లు మొత్తం ఆడి 12 బంతుల్లో 23 పరుగులు చేసి వెళ్లాడు. ఇక రాజస్తాన్ తో మ్యాచ్ లో అయితే ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాది 60 పరుగులు సాధించాడు. ప్రభ్సిమ్రన్ ఆడుతున్నంతసేపూ మరో ఎండ్ లో ఉన్న దిగ్గజ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఏదో హీరోకు బ్రదర్ రోల్ పోషించినట్టుగా ఉండిపోయాడంటే ఈ మ్యాచ్ లో అతడి ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పంజాబ్ లోని పాటియాలాకు చెందిన ఈ కుర్రాడు.. 2018లో దేశవాళీలో అరంగేట్రం చేశాడు. గతేడాదే మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ప్రభ్సిమ్రన్.. 11 మ్యాచ్ లలో 689 పరుగులు చేశాడు. 24 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 664 రన్స్ సాధించాడు. ఐపీఎల్ లో పంజాబ్ తరఫున 2020 నుంచి ఉంటున్నా పెద్దగా తన ప్రతిభను చాటే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ కు ముందు వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పాటియాలా కుర్రాడు.. ఒక్క మ్యాచ్ తో తన పేరును మార్మోగేలా చేసుకున్నాడు.
ధ్రువ్ ‘జ్యువెల్’
ఇక నిన్నటి మ్యాచ్ లోనే వెలుగులోకి వచ్చిన మరో ఆణిముత్యం ధ్రువ్ చంద్ జురెల్. ఈ కుర్రాడికి ఐపీఎల్ లో నిన్నటి మ్యాచే మొదటిది. బరిలోకి దిగిన సందర్భమేమీ ఆషామాషీది కాదు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్తాన్.. 15 ఓవర్లలో 125 పరుగులే చేసి ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో షిమ్రన్ హెట్మెయర్ ఒక్కడే పేరున్న బ్యాటర్. రాజస్తాన్ కు భారీ ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ ఈ మ్యాచ్ లో రాజస్తాన్ ను విజయపు అంచుల వరకూ తీసుకెళ్లిన ఘనత ధ్రువ్ దే అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్దీప్ వేసిన 19వ ఓవర్లో ధ్రువ్.. 4,6,4 తో రాజస్తాన్ శిబిరంలో ఆశలు రేపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ (చహల్ స్థానంలో) బరిలోకి దిగిన జురెల్.. 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 2భారీ సిక్సర్ల సాయంతో 32 రన్స్ చేశాడు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన జురెల్.. వికెట్ కీపర్ బ్యాటర్. 22 ఏండ్ల జురెల్.. బెరుకు లేకుండా ఆడగలడని నిన్నటి మ్యాచ్ చూస్తేనే అర్థమవుతున్నది. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ధ్రువ్.. 587 పరుగులు చేశాడు. నాలుగు టీ20 మ్యాచ్ లలో 60 పరుగులు సాధించాడు. గతేడాది విదర్భతో యూపీ మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్.. గతంలో భారత అండర్ - 19 టీమ్ తో పాటు ఇండియా - ఏ కూ ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో రాజస్తాన్.. రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.