
ఐపీఎల్-16 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే టేబుల్ టాపర్స్ గా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి టీమ్ అవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని హైదరాబాద్ కోరుకుంటున్నది. ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోకపోయినా నేటి మ్యాచ్ లో ఓడితే ఆ ముచ్చట కూడా తీరుతుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. 8 గెలిచి నాలుగింట ఓడి 16 పాయింట్లతే టేబుల్ టాపర్స్ గా ఉంది. నేటి మ్యాచ్ లో గెలిస్తే గుజరాత్.. ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. స్వంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్లేఆఫ్స్ టార్గెట్ గానే ఆ జట్టు బరిలోకి దిగుతున్నది.
ఇందుకు పూర్తి విరుద్ధంగా సన్ రైజర్స్ ఉంది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్.. నాలుగు మాత్రమే గెలిచి ఏడింట ఓడి 8 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్స్ నుంచి ఇంకా నిష్క్రమించకపోయినా హైదరాబాద్ అక్కడికి చేరుకోవాలంటే చాలా అద్బుతాలు జరగాలి. నేటి మ్యాచ్ తో పాటు తర్వాత రెండు మ్యాచ్ లలో భారీతేడాతో గెలిచి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలి. అంతేగాక ఇతర జట్ల ఫలితాలు కూడా మనకు అనుకూలంగా రావాలి. ఇది అంత వీజీ కాదు.
అద్భుతాల సంగతి పక్కనబెడితే మిగిలున్న మ్యాచ్ లలో అయినా గెలిచి పరువు నిలుపుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో కాస్త మెరుగవడం ఒక్కటే సన్ రైజర్స్ కు ఉన్న ఏకైక అవకాశం. మరి సన్ రైజర్స్ ఆ దిశగా విజయం సాధించేనా..? తెలియాలంటే మరికొద్దిసేపు వేచి చూడాలి.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ : శుబ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, దసున్ శనక
సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్, సాన్విర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్లా ఫరూఖీ, టి. నటరాజన్