
క్రీడా స్పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రిషభ్ పంత్, ప్రవీణ్ ఆమ్రే, శార్దూల్ ఠాకూర్ లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి ఓవర్ లో నెలకొన్న నో బాల్ వివాదంతో రాజుకున్న ఈ నిప్పు.. పెద్ద దుమారానికే దారి తీసింది. మ్యాచ్ అనంతరం బీసీసీఐ దీనిపై రిషభ్ పంత్, శార్దూల్ ల మ్యాచ్ ఫీజులలో జరిమానా వేయగా ప్రవీణ్ ఆమ్రేపై ఏకంగా ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. అయితే జరిగింది తప్పో.. ఒప్పో తాము సహనం పాటించాల్సి ఉండాల్సిందంటున్నాడు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్.
మ్యాచ్ అనంతరం వాట్సన్ మాట్లాడుతూ.. ‘చివరి ఓవర్లో జరిగిన ఘటన చాలా నిరాశపరిచింది. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్ లో మేము కాస్త వెనుకబడి ఉన్నాం. అప్పటికే పరిస్థితి మా చేజారిపోయింది. అయితే తప్పైనా ఒప్పైనా మేము అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించి తీరాలి.
ఇక ఒక వ్యక్తి నిబంధలను వ్యతిరేకంగా ఫీల్డ్ లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగడమనేది ఎంతమాత్రమూ కరెక్ట్ కాదు (ప్రవీణ్ ఆమ్రే ఉదంతంపై).. ఇది అంగీకరించరానిది. ఏదేమైనా సరే. ఆటలో అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి మేము దానికి కట్టుబడి ఉండాలి. ఆ సమయంలో నేను పంత్, ఇతర జట్టు సభ్యులతో కూడా అదే చెప్పాను. కుర్రాళ్లకు కూడా నేను ఎప్పటికీ అదే చెప్తాను..’ అని చెప్పుకొచ్చాడు.
అయితే వాట్సన్ చెప్పినదానికి ప్రేక్షకులు వీడియోలో చూసినదానికి ఎక్కడా పొంతన ఉన్నట్టు కనిపించదు. ఆఖరి ఓవర్లో మెక్ కాయ్ వేసిన మూడో బంతిని నోబాల్ అన్నదే షేన్ వాట్సన్. అక్కడున్న సభ్యులకంటే తానే ముందుగా లేచి ‘అది నో బాల్..’ అని సూచించడమే గాక అంపైర్ల పై అసహనం వ్యక్తం చేసింది కూడా అతడే.
పంత్.. ప్రవీణ్ ఆమ్రే లు ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడుతుంటే అక్కడే కామ్ గా కూర్చున్న వాట్సన్.. పంత్ ఆటగాళ్లను పిలుస్తున్నప్పుడు మాత్రం అతడితో ఏదో చర్చించినట్టు వీడియోలో స్పష్టంగా రికార్డైంది. ఇక అప్పటికీ పంత్ వినిపించుకునే స్టేజ్ లో కూడా లేకపోవడం.. ప్రవీణ్ ఆమ్రే ఏకంగా ఫీల్డ్ లోకి వెళ్లడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు.. రెచ్చగొట్టి ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఎవరేమి చెప్పినా.. బీసీసీఐ పంత్, శార్దూల్ మీద జరిమానా వేసినా.. ప్రవీణ్ ఆమ్రే పై ఒక మ్యాచ్ నిషేధం విధించినా.. అది నోబాల్ అనేది మాత్రం స్పష్టంగా ఉంది. అప్పటికీ మూడు సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న పావెల్.. మిగతా మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించేవాడో లేదో తెలియదుగానీ అతడు లయ కోల్పోయిన మాటైతే వాస్తవం. అందరూ క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడేవారే గానీ నోబాల్ గురించైతే మాట్లాడేవాళ్లు లేరంటున్నారు ఢిల్లీ ఫ్యాన్స్.