
వెస్టిండీస్ టూర్లో టెస్టు, వన్డే సిరీస్లను కైవసం చేసుకున్న భారత జట్టు, నేటి నుంచి టీ20 సిరీస్ ఆడుతోంది. ట్రినిడాడ్లో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేయనుంది..
నేటి మ్యాచ్ ద్వారా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. అలాగే వెస్టిండీస్ టూర్లో టెస్టు, వన్డే ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్కి టీ20ల్లోనూ చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 పర్యటనలో టి. నటరాజన్.. ఒకే పర్యటనలో వన్డే, టెస్టు, టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. నట్టూ తర్వాత ఈ ఫీట్ సాధించిన భారత క్రికెటర్గా నిలిచాడు ముకేశ్ కుమార్..
2024 జూన్ నెలలో వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగానే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగనుంది. దీంతో ఈ టీ20 సిరీస్, ఆ మెగా టోర్నీ ఆడబోయే జట్టును డిసైడ్ చేసేందుకు ప్రాక్టీకల్స్గా ఉపయోగపడనుంది..
వన్డే, టెస్టు సిరీస్లకు దూరమైన నికోలస్ పూరన్, రోవ్మెన్ పావెల్, ఓడియన్ స్మిత్, రోస్టన్ ఛేజ్ వంటి ప్లేయర్లు టీ20 సిరీస్లో ఆడుతున్నారు.
వన్డే సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్తో కలిసి టీ20ల్లోనూ ఓపెనింగ్ చేయబోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వన్డౌన్లో బ్యాటింగ్కి వస్తే తిలక్ వర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వరకూ భారత బ్యాటింగ్ ఆర్డర్ ఉంది..
వన్డే సిరీస్లో రిజర్వు బెంచ్కే పరిమితమైన యజ్వేంద్ర చాహాల్, టీ20 సిరీస్లో చోటు దక్కించుకున్నాడు. అర్ష్దీప్ సింగ్తో పాటు ముకేశ్ కుమార్, హార్ధిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్లుగా తుది జట్టులో చోటు దక్కించుకోగా చాహాల్తో పాటు కుల్దీప్, అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా జట్టులోకి వచ్చారు.
వెస్టిండీస్ జట్టు: కైల్ మేయర్స్, బ్రెండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, నికోలస్ పూరన్, సిమ్రాన్ హెట్మయర్, రోవ్మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, ఓబెడ్ మెక్కాయ్
భారత జట్టు: శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్