
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో రేపట్నుంచి అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను చేజిక్కించుకోవడంతో పాటు జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలని భారత్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులు జరగొచ్చని టీమ్ వర్గాల సమాచారం.
ఈ సిరీస్ లోనే ఎంట్రీ ఇచ్చి గత మూడు టెస్టులలో దారుణంగా విఫలమైన ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్ కు అహ్మదాబాద్ టెస్టులో చోటు దక్కడం గగనమేనని జట్టు వర్గాల ద్వారా తెలుస్తున్నది. అతడి స్థానంలో పరిమిత ఓవర్లలో ఆడిస్తున్న ఇషాన్ కిషన్ ను ఆడించనున్నారని సమాచారం.
రిషభ్ పంత్ గాయపడటంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న భరత్.. తొలి మూడు టెస్టులలో కీపింగ్ లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మూడు టెస్టులలో ఐదు ఇన్నింగ్స్ లలో కలిపి భరత్.. 57 పరుగులే చేశాడు. నాగ్పూర్ లో 8, ఢిల్లీలో 6, 23 నాటౌట్, ఇండోర్ లో 17, 3 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాపై ధాటిగా ఆడే పంత్ స్థానంలో వచ్చిన భరత్.. అతడిని మరిపించడంలో విఫలమయ్యాడు. దీంతో భరత్ ను నాలుగో టెస్టులో పక్కనబెట్టనున్నారని తెలుస్తున్నది.
గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో మూడోవన్డేలో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో పర్మనెంట్ అవుతున్న ఇషాన్.. పంత్ లేకపోవడంతో అతడి ప్లేస్ ను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
అహ్మదాబాద్ టెస్టుకు ముందే నెట్స్ లో రాహుల్ ద్రావిడ్.. ఇషాన్ కిషన్ తో ప్రత్యేకంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించినట్టు పలు జాతీయ వెబ్సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం నాలుగో టెస్టులో భరత్ ను పక్కనబెట్టడం ఖాయమేనని తెలుస్తున్నది.
భరత్ తో పాటు సిరాజ్ ను కూడా ఈ మ్యాచ్ లో పక్కనబెట్టనున్నారు. సిరాజ్ ను తప్పించి మహ్మద్ షమీని తిరిగి జట్టులోకి తీసుకోనున్నారు. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందానిపై ఇరు జట్లకూ ఇంకా స్పష్టమైన సమాచారం లేని నేపథ్యంలో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్నే అనుసరించనుంది.