
వెస్టిండీస్, టీమిండియా మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30లకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) రెండో టీ20 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ట్రిడినాడ్ నుంచి సెయింట్ కిట్స్కి రావాల్సిన భారత ఆటగాళ్ల కిట్స్ రాక ఆలస్యం కానుంది...
దీంతో కిట్ వచ్చేందుకు రెండు గంటల సమయం పడుతుందని సాయంత్రం 4:30లకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి అర్ధరాత్రి దాటనుంది. ఇప్పటికే టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్లను చూసేందుకు భారత్లో సరైన సదుపాయం లేదు. డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో మినహా స్టార్ నెట్వర్క్లో కానీ, సోనీ నెట్వర్క్లో కానీ ఈ టూర్ మ్యాచులకు సంబంధించిన లైవ్ రావడం లేదు...
ఇంట్లో టీవీ లేని వారికి డీడీ స్పోర్ట్స్లో మ్యాచులు చూసే అవకాశం ఉండదు. ఫ్యాన్ కోడ్ వెబ్సైట్ ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్నా మ్యాచులు చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీంతో ఈ మ్యాచులను పట్టించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అదీకాకుండా ఇలా అర్ధరాత్రి మ్యాచులు జరుగుతుండడంతో వెస్టిండీస్, భారత్ మ్యాచులకు సరైన రెస్పాన్స్ రావడం లేదు...
ఇంగ్లాండ్ టూర్లో వన్డే, టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు, వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది. మొదటి టీ20లో 68 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, సెయింట్స్ కిట్స్లో రెండో, మూడో టీ20 మ్యాచులను ఆడనుంది.
ఆ తర్వాత ఆఖరి రెండు టీ20 మ్యాచులు యూఎస్ఏలోని ఫ్లోరిడా వేదికగా జరగబోతున్నాయి. అయితే ఈ మ్యాచుల కోసం అమెరికా చేరేందుకు ఇరు జట్ల ఆటగాళ్లకు ఇంకా వీసా అనుమతులు రావాల్సి ఉందని సమాచారం...
నేడు, రేపు వరుసగా టీ20 మ్యాచులు ఆడే టీమిండియా, నాలుగు రోజుల గ్యాప్ తర్వాత ఫ్లోరిడాలో ఆగస్టు 6న నాలుగో టీ20, ఆగస్టు 7న ఐదో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాలోకి కొందరు ప్లేయర్లు జింబాబ్వే టూర్కి బయలుదేరితే హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి సీనియర్లు మాత్రం స్వదేశానికి తిరిగి రాబోతున్నారు...
ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022 టోర్నీ వరకూ భారత సీనియర్లకు విశ్రాంతి నిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసే వరకూ ఆటగాళ్లకు ఇక రెస్ట్ ఇచ్చేది లేదని బీసీసీఐ ఇప్పటికే ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం...
ఇంగ్లాండ్ టూర్ తర్వాత వెస్టిండీస్ టూర్ మొత్తానికి దూరమైన విరాట్ కోహ్లీ, జింబాబ్వే టూర్కి కూడా అందుబాటులో ఉండడం లేదు. అలాగే స్వదేశంలో సౌతాఫ్రికా టూర్ నుంచి భారత జట్టుకి దూరంగా ఉంటూ వస్తున్న కెఎల్ రాహుల్ కూడా ఆసియా కప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.