
తన కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి.. మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేయలేకపోయినా రవీంద్ర జడేజా ఆ పని పూర్తి చేశాడు. తన కెరీర్ లో రెండో సెంచరీని సాధించాడు. జడేజాకు తోడు అశ్విన్ కూడా మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్దరి వీర విహారంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్నది.
ఓవర్ నైట్ స్కోరు 357-6 వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియాకు జడేజా (166 బంతుల్లో 102 నాటౌట్ 10 ఫోర్లు), అశ్విన్ (82 బంతుల్లో 61.. 8 ఫోర్లు) ల జోరు తోడైంది. ఇద్దరూ కలిసి ఎడాపెడా బౌండరీలు బాదుతూ భారీ స్కోరు దిశగా కదిలారు.
45 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన జడేజా.. ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 10 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ కూడా బ్యాటుకు పనిచెప్పాడు. ఇద్దరూ కలిసి లంక బౌలర్లుకు అవకాశమివ్వకుండా ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూనే.. గతి తప్పిన బాల్స్ ను శిక్షించారు. ఇద్దరూ కలిసి పోటీ పడి పరుగులు సాధించారు. ఈ క్రమంలో జడేజా సెంచరీకి చేరువకాగా.. అశ్విన్ టెస్టులలో తన 12 వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఎంబుల్డెనియా వేసిన ఇన్నింగ్స్ 108వ ఓవర్లో ఫోర్ కొట్టి 99 వద్దకు చేరుకున్న జడేజా.. తర్వాత అతడే వేసిన 110వ ఓవర్లో తొలి బంతిని కవర్స్ దిశగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం జడ్డూ.. తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ (బ్యాటును కత్తిలా తిప్పడం) చేసుకున్నాడు. అయితే లంచ్ బ్రేక్ కు సరిగ్గా రెండు ఓవర్ల ముందు లక్మల్ వేసిన ఓవర్లో అశ్విన్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
కాగా లంచ్ సమయానికి భారత్.. 112 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది. జడేజా (102 బ్యాటింగ్), జయంత్ యాదవ్ (2 బ్యాటింగ్) లు క్రీజులో ఉన్నారు. 500 రన్స్ చేసి లంకను ఒత్తిడిలోకి నెట్టాలని భారత్ భావిస్తున్నది. రెండో రోజు నుంచి మొహాలీ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది. ఇదే దృష్టిలో పెట్టుకుని భారీ స్కోరు సాధించాలని భారత్ భావిస్తున్నది. అంతకుముందు తొలి రోజు భారత జట్టు ఆటగాళ్లలో రిషభ్ పంత్ (96),హనుమ విహారి (58), విరాట్ కోహ్లి (45) రాణించారు.