
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఆట రెండో రోజులో భాగంగా శనివారం బ్యాటింగ్ లో లంకకు చుక్కలు చూపించిన రాక్ స్టార్ రవీంద్ర జడేజా.. నేడు బంతితో లంక పనిపట్టాడు. తన స్పిన్ మాయాజాలాన్ని లంకేయులకు రుచి చూపుతూ.. ఐదు వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచాడు. జడ్డూ కు తోడు మహ్మద్ షమీ కూడా రాణించడంతో లంక.. తొలి సెషన్ కూడా పూర్తిగా ముగియకముందే పెవిలియన్ కు చేరింది. 65 ఓవర్లు ఆడి 174 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓవర్ నైట్ స్కోరు 108-4 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన లంకను బుమ్రా తొలి దెబ్బ తీశాడు. కుదురుకుంటున్న చరిత్ అసలంక (29) అద్భుత ఎల్బీతో బోల్తా కొట్టించాడు. అసలంక ఇన్నింగ్స్ ముగిశాక మొదలైంది జడ్డూ మాయాజాలం.
లంక ఇన్నింగ్స్ 60వ ఓవర్లో తొలి బంతికి వికెట్ కీపర్ నిరోషన్ (2) ను వెనక్కి పంపిన జడేజా.. అదే ఓవర్లో ఆఖరు బంతికి లక్మల్ (0)ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వంతు షమీది.. 63వ ఓవర్ వేసిన షమీ.. ఎంబుల్దెనియా (0) ను ఔట్ చేశాడు.
ఇక ఆ తర్వాత ఓవర్ వేసిన జడ్డూ .. 64 వ ఓవర్లో లంక తోకను కూడా కత్తిరించాడు. ఒకే ఓవర్లో ఫెర్నాండో (0), లాహిరు కుమార (0) ను పెవిలియన్ కు పంపి లంక ఇన్నింగ్స్ కు తెరదించాడు. దీంతో 65 ఓవర్లలో లంక.. 174 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులు వెనుకబడి ఉంది.
కాగా.. టెస్టులలో 5 వికెట్లు సాధించడం జడేజా కు ఇది పదో సారి. జడేజా సాధించిన ఈ ఫీట్ తో ఒక టెస్టులో 150 ప్లస్ పరుగులు చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విను మాన్కడ్ (184, 5 వికెట్లు), డెనిస్ అట్కిన్సన్ (219, 5 వికెట్లు), పాలీ ఉమిగ్రర్ (172, 5 వికెట్లు), గ్యారీ సోబర్స్ (174, 5 వికెట్లు ), ముస్తాక్ మహ్మద్ (201, 5 వికెట్లు), రవీంద్ర జడేజా (175*, 5 వికెట్లు) ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్సులో రవీంద్ర జడేజా.. 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా.. టీమిండియా సారథి రోహిత్ శర్మ లంకను ఫాలో ఆన్ ఆడించాడు. తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక.. 4 ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్ లాహిరు తిరిమన్నె (0) వికెట్ కోల్పోయి 10 పరుగులు చేసింది. ఈ వికెట్ అశ్విన్ కు దక్కింది. అశ్విన్ మరో వికెట్ తీస్తే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ తో సమానంగా నిలుస్తాడు. కపిల్ దేవ్ 434 వికెట్లు తీయగా.. అశ్విన్ 433 వికెట్లతో ఒక వికెట్ దూరంలో నిలిచాడు.