రోహిత్ శర్మకు విశ్రాంతి: ఇక ఆ రికార్డు విరాట్ కోహ్లీ సొంతం

By telugu teamFirst Published Jan 4, 2020, 2:00 PM IST
Highlights

రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో విరాట్ కోహ్లీ శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ లో రికార్డు సాధించే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు.

గౌహతి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. శ్రీలంకతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ కు టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంది. ఆదివారంనాడు గౌహతిలో తొలి టీ20 మ్యాచు జరుగుతుంది. వెస్టిండీస్ పై మూడు టీ20ల సిరీస్ ను, మూడు వన్డేల సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా మంచి ఊపు మీద ఉంది. 

టీ20 పరుగుల్లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను దాటేసే అవకాశం ఉంది. వీరిద్దరు కూడా 2,633 పరుగులతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఆదివారం జరిగే మ్యాచులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను అధిగమించడం ఖాయమైంది. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో పరుగుల పోటీలో కోహ్లీతో పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. 

కేవలం ఒక్క పరుగు సాధిస్తే రోహిత్ శర్మను కోహ్లీ అధిగమిస్తాడు. వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. మూడో టీ20లో 29 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

తద్వారా మూడు ఫార్మాట్లకు సరిపడా క్రికెటర్ నని, అవసరమైతే తాను హిట్టింగులో తాను ఎవరికీ తీసిపోనని కోహ్లీ నిరూపించుకున్నాడు. 

click me!