
ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభమైనా, ఇప్పటిదాకా పెద్దగా హైప్ రాలేదు. నేపాల్- పాక్ మధ్య జరిగిన మ్యాచ్ వన్సైడెడ్గా చప్పగా సాగింది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్కీ పెద్దగా బజ్ లేదు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తున్నారు..
సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సజావుగా సాగడం కష్టమేనని వాతావరణ శాఖ తెలియచేసింది. శనివారం, పల్లెకెలెలో 91 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది..
వాతావరణ శాఖ అంచనా ప్రకారం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి (మధ్యాహ్నం 3 గంటలకు) ఆకాశం మేఘావృత్తమై ఉంటుంది. 5 గంటలకు చినుకులతో కూడిన వర్షం మొదలవుతుంది. 5 గంటలకు జోరు వాన మొదలై, 11 గంటల వరకూ ఎడతెడపి లేకుండా వర్షం కురుస్తుంది.
అంటే మ్యాచ్ ప్రారంభమైనా తొలి ఇన్నింగ్స్ పూర్తి కావడం కూడా కష్టమే. టాస్ గెలిచిన జట్టు కచ్ఛితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సమయానికి వర్షం కురిస్తే, లక్ష్యఛేదన కష్టమైపోతుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయాల్సి రావచ్చు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్, మరో ఆలోచన లేకుండా తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు.
వేగంగా పరుగులు చేసి, వీలైనంత ఎక్కువ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు పెట్టాలని భావించవచ్చు. ముల్తాన్లో జరిగిన ఆసియా కప్ 2023 ఆరంభ మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా ముగిసింది. నేపాల్పై 238 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న పాకిస్తాన్, టీమిండియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే నేరుగా సూపర్ 4 స్టేజీకి అర్హత సాధిస్తుంది.
అప్పుడు టీమిండియా, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు భారీ విజయం సాధిస్తేనే, గ్రూప్ A నుంచి టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ఇండియా, నేపాల్తో సెప్టెంబర్ 4న ఆడాల్సిన మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. అది కూడా వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం గ్రూప్ స్టేజీలో టీమిండియా రెండో స్థానంలో నిలుస్తుంది.
కరువు దేశంగా పేరొందిన పాకిస్తాన్లో వర్షాలు పెద్దగా కురవడం లేదు. అయితే శ్రీలంకలో పరిస్థితి అలా లేదు. లంకలో వర్షాలు విపరీతంగా కురుస్తుండడంతో అక్కడ జరగాల్సిన 9 మ్యాచుల్లో ఫలితం తేలడం కష్టమేననే అభిప్రాయం కూడా వినబడుతోంది. పల్లెకెలెలో ఇప్పటిదాకా 33 వన్డే మ్యాచులు జరిగాయి. అయితే వర్షాకాలంలో ఈ స్టేడియంలో జరిగిన మ్యాచులు కేవలం మూడు.
వర్షా కాలంలో ఈ ఏరియాలో వానలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ క్లియర్గా చెప్పడంతో ఇక్కడ మ్యాచులు నిర్వహించడం ఆపేశారు. అయితే ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులను ఆఖరి నిమిషంలో దక్కించుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు, ఇక్కడ మ్యాచులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.