
అంతా అనుకున్నట్టే అయ్యింది. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి వర్షం అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ 18 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేయగా శుబ్మన్ గిల్ 8 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు..
టాస్ వేయడానికి ముందు చిరుజల్లులు కురిసినా, కొద్దిసేపటికే తగ్గిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం కురవడంతో మ్యాచ్కి అంతరాయం కలిగింది. భారీ వర్షం కావడంతో వాన ఆగినా గ్రౌండ్పై నిలిచిన నీటిని తొలగించేందుకు చాలా సమయం పట్టనుంది.
షాహీన్ ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికి ఫోర్ బాది, ఖాతా తెరిచాడు రోహిత్ శర్మ. అయితే స్వైర్ లెగ్లో ఫీల్డర్ చేతులను తాకుతూ బంతి బౌండరీకి వెళ్లడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
నసీం షా వేసిన రెండో ఓవర్లో శుబ్మన్ గిల్ అవుట్ కోసం అప్పీల్ చేసింది పాకిస్తాన్. ఈ సంఘటన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి గురైన శుబ్మన్ గిల్, నసీం షా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 6 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు.. ఈ ఓవర్లో వైడ్ రూపంలో ఓ ఎక్స్ట్రా మాత్రమే వచ్చింది.