
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఆడాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. (భారత కాలమానం ప్రకారం మధ్యహ్నం 12 గంటలకు) అయితే టాస్ వేయడానికి ముందు నుంచి భారీ వర్షం కురిసి, ఆగుతూ వచ్చింది. దాదాపు గంటన్నర పాటు వర్షం ఆగుతుందేమోనని ఎదురుచూసిన అంపైర్లు, వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు....
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బంగ్లాదేశ్తో మ్యాచ్కి వర్షం అంతరాయం కలిగించినా... అదృష్టం కలిసి వచ్చి కరెక్ట్ సమయానికి వాన ఆగిపోవడంతో టీమిండియా బతికిపోయింది. బంగ్లాని ఓడించి సెమీ ఫైనల్ చేరింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్లో ఓడిన ఇండియా,న్యూజిలాండ్ జట్లు..టీ20 సిరీస్లో పాల్గొంటున్నాయి..
తొలి టీ20 రద్దు కావడంతో మిగిలిన రెండు టీ20ల్లో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది. చెరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం నవంబర్ 20న బే ఓవల్లోని మౌంట్ మౌన్గునాయ్లో జరుగుతుంది...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ 2 నుంచి టేబుల్ టాపర్గా సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. గ్రూప్ 1 నుంచి టేబుల్ టాపర్గా సెమీస్ చేరిన న్యూజిలాండ్ జట్టు, పాకిస్తాన్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది...
టీ20 సిరీసుల్లో న్యూజిలాండ్పై టీమిండియాకి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 20 టీ20 మ్యాచులు జరగగా అందులో 11 మ్యాచులను టీమిండియా గెలిచింది. 9 మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్కి మంచి రికార్డు ఉంది. ఇండియాలో జరిగిన టీ20 సిరీస్లో 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది కివీస్ జట్టు...
అయితే స్వదేశంలో న్యూజిలాండ్ని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.