India vs South Africa: లక్ష్య చేధనలో కుప్పకూలిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ భారత్‌దే..

By Rajesh KarampooriFirst Published Dec 22, 2023, 12:26 AM IST
Highlights

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. బోలాండ్ పార్క్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.   

India vs South Africa:  దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు సఫారీలను ఓడించింది. తొలి మ్యాచ్‌లోనూ విజయం సాధించాడు. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో భారత్ విజయం సాధించింది. చివరిసారిగా 2018లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో సిరీస్‌ గెలిచింది.

పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 296 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులో టోనీ డి జార్జి అత్యధికంగా 81 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈసారి అలా చేయలేకపోయాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 36 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 21, రీజా హెండ్రిక్స్ 19, బ్యూరెన్ హెండ్రిక్స్ 18, కేశవ్ మహరాజ్ 10 పరుగులకే పరిమితమయ్యారు.

Latest Videos

ఇక రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాడ్ విలియమ్సన్ చెరో రెండు పరుగులు మాత్రమే చేయగలిగారు. వియాన్ ముల్డర్ ఒక పరుగు, నాండ్రే బెర్గర్ ఒక పరుగు చేసి ఫెవిలియన్ బాట పట్టారు. భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీశాడు. ఆయన సిరీస్‌లో మొత్తం తొమ్మిది వికెట్లు తీశాడు. ఇక అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లు తలో రెండు వికెట్టు పడగొట్టారు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.


అంతకు ముందు .. టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 296 పరుగులు చేసింది. భారత్ తరఫున సంజూ శాంసన్ అత్యధికంగా 108 పరుగులు చేయగా, తిలక్ వర్మ 52 పరుగులు చేశాడు. శాంసన్ తన ODI కెరీర్‌లో మొదటి సెంచరీ చేయగా.. తిలక్ మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన  రింకూ సింగ్ తనదైన ముద్రవేశారు. 27 బంతుల్లో 38 పరుగులు వేసి వెనుదిగాడు. 

తొలి వన్డే ఆడిన రజత్ పాటిదార్ 16 బంతుల్లో 22 పరుగులు, కెప్టెన్ కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 21 పరుగులు చేశారు. 14 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్, 10 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔట్ అయ్యారు. అక్షర్ పటేల్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. అర్ష్‌దీప్ సింగ్ ఏడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, అవేష్ ఖాన్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా తరఫున బ్యూరెన్ హెండ్రిక్స్ గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టాడు. నాండ్రే బెర్గర్ రెండు వికెట్లు తీశారు. లిజాద్ విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్ ఒక్కొక్కరు వికెట్ పడగొట్టారు.

click me!