
టీమిండియా నయా టెస్టు సారథి రోహిత్ శర్మ తన తొలి టెస్టులో విజయం అందుకున్నాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో లంకేయలను మూడు రోజుల్లోనే మట్టి కరిపించింది టీమిండియా. లంకను తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే బోల్తా కొట్టించిన భారత స్పిన్నర్లు.. రెండో ఇన్నింగ్స్ లో 178 రన్స్ కు ఆలౌట్ చేసింది. ఫలితంగా భారత జట్టు.. 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచుల టెస్టు సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
మొహాలీ టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది రోహిత్ సేన. తొలుత బ్యాటింగ్ లో భారీ స్కోరు (574/8) సాధించిన టీమిండియా.. ఆ తర్వాత లంకకు బౌలింగ్ లో చుక్కలు చూపించింది. టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా ల మాయజాలానికి లంక తట్టుకోలేకపోయింది.
తొలి టెస్టు మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 108/4 వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. లంచ్ కు ముందే లంక.. మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా (5-41) మాయాజాలానికి తోడు అశ్విన్ (2), బుమ్రా (2), షమీ (1) లు రాణించడంతో లంక తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే తోక ముడిచింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితి లంకది.
400 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లంక.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ దశలోనూ క్రీజులో నిలవాలనే నిలకడ ప్రదర్శించలేదు. వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ కు చేరారు. సెకండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆ జట్టును అశ్విన్ తొలి దెబ్బ తీశాడు. ఓపెనర్ లాహిరు తిరిమన్నే (0) ను ఔట్ చేసి లంక వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఆ వెంటనే కొద్దిసేపటికే.. మళ్లీ అశ్విన్ బౌలింగ్ లోనే పథుమ్ నిస్సంక (6) కూడా వెనుదిరిగాడు. 15 ఓవర్లలోపే లంక 45 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మాథ్యూస్ (28), ధనుంజయ డి సిల్వ (30) ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 49 పరుగులు జోడించారు. ఈ జోడిని జడేజా విడదీశాడు.
మాథ్యూస్-ధనుంజయ ప్రతిఘటన అనంతరం లంక వికెట్ల పతనం వేగంగా సాగింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్ల (51 నాటౌట్) లంకను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ జడేజా, అశ్విన్ లు వారికి అవకాశమివ్వలేదు. ఆట మూడో రోజు లంక ఏకంగా 16 వికెట్లు కోల్పోవడం విశేషం.
ఈ టెస్టులో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టిన రవీంద్ర జడేజా కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచు అవార్డు దక్కింది. కాగా.. తొలి టెస్టులోనే విజయం సాధించిన రెండో భారత సారథిగా రోహిత్ రికార్డులకెక్కాడు. గతంలో పాలి ఉమ్రిగర్ పేరిట ఈ రికార్డు ఉంది.