
IND vs ENG, T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 రెండవ సెమీ-ఫైనల్లో భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇరు జట్ల ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయలేదు. చివరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్స్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. వర్షం కారణంగా టాస్ దాదాపు 1:30 గంటలు ఆలస్యమైంది.
టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీల జోడీ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఈ టోర్నీలో మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ పని చేయలేదు. మూడో ఓవర్లోనే రీస్ టాప్లీకి వికెట్ రూపంలో దొరికిపోయాడు. టాప్లీ వేసిన ఓవర్ రెండో బంతికి కింగ్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. దీని తర్వాత, అతను నాలుగో బంతిని కూడా భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు.. కానీ కనెక్షన్ కుదరలేదు. బంతి వికెట్లను తాకడంతో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరాడు. 9 బంతులు ఆడిన కోహ్లీ 9 పరుగులు చేశాడు. భారత్ 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 4 పరుగుల వద్ద పంత్ ఔట్ అయ్యాడు.
అయితే, మరో ఎండ్ రోహిత్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించారు. భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాండు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్లో యాభై పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్లో కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్పై రోహిత్ ఇప్పుడు అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్ మూడో బంతికి సామ్ కుర్రాన్ వేసిన ఓవర్ లో సిక్సర్ బాది హిట్మ్యాన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. 14వ ఓవర్ నాలుగో బంతికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో హిట్మన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 బంతుల్లో 57 పరుగుల తన ఇన్నింగ్స్ రోహిత్ 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మొత్తంగా రోహిత్ కు 32వ హాఫ్ సెంచరీ.
మరో ఎండ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మంచి షాట్స్ ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే అతను 3 పరుగులు దూరంలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. 16వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడాడు కానీ, బౌండరీలో క్రిస్ జోర్డాన్కి క్యాచ్ గా దొరికిపోయాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య తన ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సర్లు, ఒక ఫోర్ తో 23 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 17*, అక్షర్ పటేల్ 10 పరుగులు చేయడంలో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి కారణాలు ఇవే