
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆస్ట్రేలియానే ఫెవరెట్. భారత స్టార్ ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్ గాయాలతో ఈ సిరీస్కి దూరం కావడంతో ఆస్ట్రేలియా, ఈసారి ఇండియాలో టీమిండియాని ఓడించి టెస్టు సిరీస్ గెలవగలదని అనుకున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఐసీసీ నెం.1 టీమ్కి అంత సీన్ లేదని మొదటి రెండు టెస్టుల్లో తేలిపోయింది..
నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో కూడా కోలుకోలేకపోయింది. రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆసీస్, ఇండియాలో టెస్టు సిరీస్ గెలవాలనే కోరికను ఈసారి కూడా నెరవేర్చుకోలేకపోయింది...
ఇండోర్లో జరగనున్న మూడో టెస్టు ఇరుజట్లకి కీలకంగా మారింది. ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. ప్యాట్ కమ్మిన్స్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో కమ్మిన్స్ తనతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో మూడో టెస్టుకి స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు...
గాయాలతో మొదటి రెండు టెస్టుల్లో ఆడని మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో ఆడబోతున్నారు. అలాగే మిచెల్ స్వీప్సన్ కూడా మూడో టెస్టులో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ప్లేయర్లు బరిలో దిగుతుండడంతో ఈసారి భారత జట్టుకి గట్టి పోటీయే ఇచ్చేలా కనిపిస్తోంది ఆస్ట్రేలియా...
మూడో టెస్టులో గెలిస్తే టీమిండియాకి డబుల్ బోనస్లు దక్కబోతున్నాయి..నెం.1 టెస్టు టీమ్గా ఉన్న ఆస్ట్రేలియా, మూడో టెస్టులో ఓడితే ఆ ప్లేస్ని కోల్పోతుంది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో నెం.1 టీమ్గా ఉన్న భారత జట్టు.. మూడు ఫార్మాట్లలో నెం.1 పొజిషన్ని దక్కించుకుంటుంది...
అంతేకాకుండా ఇప్పటికే 99 శాతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా, మూడో టెస్టులో గెలిస్తే... నేరుగా ఫైనల్ చేరుతుంది. వరుసగా రెండోసారి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిఫ్ ఫైనల్ ఆడబోతున్న తొలి జట్టుగా నిలుస్తుంది భారత్..
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓడితే.. ఫైనల్ చేరేందుకు అహ్మదాబాద్లో ఆఖరి టెస్టుని కనీసం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే, టీమిండియా చివరి టెస్టును డ్రా చేసుకుంటే సరిపోతుంది...
ఒకవేళ భారత జట్టు, మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలిచి, ఆస్ట్రేలియాని 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా ఫైనల్ చేరేందుకు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ ఫలితం వచ్చే వరకూ ఆగాల్సి ఉంటుంది. ఒవేళ శ్రీలంక జట్టు, న్యూజిలాండ్పై రెండు టెస్టులు గెలిచి 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే.. ఆసీస్ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది..
అదే జరిగితే ఇండియా, శ్రీలంక, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడతాయి. వరుసగా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్న భారత జట్టు, లంకను ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. న్యూజిలాండ్ ఒక్క టెస్టు డ్రా చేసుకున్నా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఎలాంటి మార్పులు లేకుండా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.. ఇంగ్లాండ్లో జరిగే ఫైనల్ కావడంతో అక్కడ టీమిండియా విజయావకాశాలు మళ్లీ తక్కువే..