
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు నేడు ఐర్లాండ్ తో కీలక మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు రానుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారత జట్టు ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్ లను ఓడించిన భారత్.. రెండ్రోజుల క్రితం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఛేదనలో తడబడి ఓడింది. దీంతో నేటి మ్యాచ్ లో గెలవడం భారత్ కు అత్యావశ్యకం అయింది.
ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఓడటం వల్ల భారత్ కు సెమీస్ గండం పొంచి ఉంది. నేడు ఐర్లాండ్ ఏమైనా షాక్ ఇస్తే అది భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లుతుంది. గ్రూప్ - బి పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి (ఆరు పాయింట్లు) సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్ లు ఆడిన భారత జట్టు రెండు మ్యాచ్ లలో గెలిచి ఒకదాంట్లో ఓడింది. దీంతో నాలుగు పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో నెగ్గితే అది టీమిండియాకే మంచిది. నెట్ రన్ రేట్ తో భారత్ కాకుండా వెస్టిండీస్ సెమీస్ కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి.
ఒకవేళ నేటి మ్యాచ్ లో భారత్ కు ఐర్లాండ్ షాకిస్తే అప్పుడు పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మరి హర్మన్ప్రీత్ కౌర్ సేన ఏం చేసేనో..?
తుది జట్లు:
భారత్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రకార్, శిఖా పాండే, దేవికా వైధ్య, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకాసింగ్ ఠాకూర్
ఐర్లాండ్ : అమీ హంటర్, గ్యాబీ లూయిస్, ఒర్ల ప్రెండర్గస్ట్, ఎలిమీర్ రిచర్డ్సన్, లూయిస్ లిటిల్, లారా డీల్నీ (కెప్టెన్), అరీన్ కెల్లీ, మెరీ వల్డ్రాన్, కారా ముర్రే, లీ పాల్, జార్జినా డెంప్సీ