T20 Worldcup: గెలవాలంటే వాళ్లిద్దరినీ తప్పించి ఇషాన్, శార్దూల్ ను తీసుకోండి.. విరాట్ కు గవాస్కర్ సూచన..

By team teluguFirst Published Oct 29, 2021, 12:46 PM IST
Highlights

Sunil Gavaskar: వచ్చే ఆదివారం జరగబోయే మ్యాచ్ లో విజయం సాధించడం విరాట్ కు అత్యావశ్యకం. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ పోరుకు ముందంజ వేయాలని అతడు భావిస్తున్నాడు. కివీస్ తో మ్యాచ్ ఓడిపోతే గనుక కెప్టెన్ గా ఐసీసీ ట్రోఫీ అందుకోవాలన్న కోహ్లి కల.. కలగానే ఉండిపోవడం ఖాయం. 

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)కు ముందు టోర్నీ హాట్ ఫేవరేట్ గా ఉన్న టీమిండియా (Team India).. గత ఆదివారం పాకిస్థాన్ (pakistan) తో జరిగిన మ్యాచ్ లో ఓడి అసలు సెమీస్ బెర్త్ అయినా దక్కించుకుంటుందా..? అనే అనుమానం మొదలైంది.  ఐసీసీ (ICC) ఈవెంట్లలో న్యూజిలాండ్ (Newzealand) కు భారత్ (India) మీద ఘనమైన రికార్డు ఉండటమే ఇందుకు కారణం. 

ఒక రకంగా వచ్చే ఆదివారం భారత్-న్యూజిలాండ్ (India Vs Newzealand) ల మధ్య జరిగే కీలక  మ్యాచ్ ను పలువురు సీనియర్ క్రికెటర్లు నాకౌట్ పోరుగానూ అభివర్ణిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత  క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (virender Sehwag).. టీమిండియా సారథి విరాట్ కోహ్లికి కీలక సూచన చేశారు. 

వచ్చే ఆదివారం జరగబోయే మ్యాచ్ లో విజయం సాధించడం న్యూజిలాండ్  ముఖ్యమైనదే అయినా విరాట్ (Viratb Kohli) కు అయితే అత్యావశ్యకం.  ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ పోరుకు ముందంజ వేయాలని అతడు భావిస్తున్నాడు. కివీస్ తో మ్యాచ్ ఓడిపోతే గనుక కెప్టెన్ గా ఐసీసీ ట్రోఫీ అందుకోవాలన్న కోహ్లి కల.. కలగానే ఉండిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. 

ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. అంతగా ఫామ్ లో లేని భువనేశ్వర్ (Bhuvaneshwar) తో పాటు ఫిట్నెస్ లేమితో తంటాలు పడుతున్న హార్ధిక్ పాండ్యా (Hardik Pandya)కు విశ్రాంతినివ్వాలని విరాట్ కు సూచించాడు. ఒక టీవీ ఛానెల్ తో  మాట్లాడుతూ.. ‘ఒకవేళ పాండ్యా బౌలింగ్ వేయకుంటే అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ను తుది జట్టులోకి తీసుకోవడం ఉత్తమం’ అని అన్నాడు. 

టీ20 టోర్నీకి ముందే ఫిట్నెస్ లేక ఐపీఎల్ (IPL) లో కూడా పాండ్యా బౌలింగ్ చేయలేదు. కేవలం బ్యాటింగ్ కే పరిమితమయ్యాడు. ఇక పాకిస్థాన్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా పాండ్యా భుజానికి గాయం కూడా అయిన విషయం తెలిసిందే. 

పాండ్యా తో పాటు టీమిండియా పేసర్ భువనేశ్వర్ (Bhuvaneshwar) ను కూడా పక్కనబెట్టాలని గవాస్కర్ సూచించాడు. ఫామ్ లో లేని అతడి స్థానంలో  చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్  శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ను తీసుకోవాలని అన్నాడు.  అయితే జట్టులో ఎక్కువ మార్పులు చేయడం కూడా మంచిది కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అలా చేస్తే మనం భయపడుతున్నామని ప్రత్యర్థి జట్టు భావిస్తుందని, అది మొదటికే మోసమని చెప్పాడు. 

‘మీరు (టీమిండియా) జట్టులో ఎక్కువ మార్పులు చేస్తే  భయాందోళనళకు గురవుతున్నామనే విషయం ప్రత్యర్థికి తెలిసిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి మంచి జట్టు (పాకిస్థాన్) ఉంది. మీరు మంచి జట్టు చేతిలో ఓడిపోయారు. అలాగని నిరాశ చెందాల్సిన పన్లేదు. మీరు తర్వాత నాలుగు మ్యాచ్ లలో గెలిస్తే సెమీస్ కు చేరుకోవచ్చు. అక్కడనుంచి ఫైనల్ కు కూడా వెళ్లొచ్చు’ అని సన్నీ అన్నాడు. 

ఇక డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఫామ్ లోని భువనేశ్వర్ స్థానంలో శార్ధూల్ ఠాకూర్ ను తీసుకోవాలని కోహ్లికి సూచించాడు. మరి ఆదివారం జరిగే కీలక పోరులో కోహ్లి.. ఎవరివైపు మొగ్గు చూపుతాడో తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే. 

click me!