
మహిళల ప్రపంచకప్ లో తప్పక నెగ్గాల్సిన మ్యాచులో మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్ ను మట్టి కరిపించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే బంగ్లాదేశ్ ను ఓడించినంత మాత్రానా టీమిండియా సరాసరి సెమీస్ కు చేరలేదు. సెమీస్ గడప తొక్కాలంటే మన వనితలు సఫారీ గండం దాటాలి. ఈ టోర్నీలో నాలుగు విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా తో మ్యాచులో భారత్ తప్పకుండా గెలవాలి. ఆ మ్యాచులో ఫలితం భారత్ కు ఏ మాత్రం వ్యతిరేకంగా వచ్చినా ఇక ఇతర జట్ల ప్రదర్శన మీద ఆధారపడాల్సి ఉంటుంది.
మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో 230 పరుగులను కాపాడుకునే క్రమంలో టీమిండియా బౌలర్లు చెలరేగి ఆ జట్టును 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ విజయం భారత్ కు నెట్ రన్ రేట్ పెంచుకునేందుకు మెరుగుపడింది. ప్రస్తుతం ఈ మెగా ఈవెంట్ లో 6 మ్యాచులాడి 3 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ కు చేరడమెలాగో ఇక్కడ చూద్దాం.
ఉమెన్స్ వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలు నిలుపుకోవాలంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచులో భారత్ తప్పకుండా గెలవాలి. సఫారీలను ఓడిస్తే మిథాలీ సేన మిగతా ఎటువంటి లెక్కలతో సంబంధం లేకుండా సెమీస్ కు చేరుతుంది. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచులాడిన దక్షిణాఫ్రికా మహిళా జట్టును ఓడించడం అంత తేలికేం కాదు. వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాక్ మినహా బలమైన జట్లుగా ముద్రపడ్డ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లపై భారత్ చిత్తుగా ఓడింది. మరోవైపు ఒక్క ఆసీస్ చేతిలో తప్ప ఓటమి రుచి చూడని దక్షిణాఫ్రికా.. ఆదివారం నాటి మ్యాచ్ కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది.
ఒకవేళ ఆ మ్యాచులో ఓడితే మాత్రం.. అప్పుడు భారత్ కు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ లు ఆడే మ్యాచుల ఫలితాలపై టీమిండియా ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 6 మ్యాచులాడి 6 విజయాలతో +1.29 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 5 మ్యాచులాడి.. 4 విజయాలు 1 ఓటమి తో +0.09 నెట్ రన్ రేట్ (8 పాయింట్లు) తో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఇండియా.. 6 మ్యాచులాడి.. 3 విజయాలు, 3 ఓటములతో +0.77 నెట్ రన్ రేట్ (6 పాయింట్లు) తో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న విండీస్.. 6 మ్యాచులాడి 3 విజయాలు అన్నే ఓటములు ఉన్నా నెట్ రన్ రేట్ మాత్రం (-0.89) మైనస్ లో ఉంది. పాయింట్ల విషయంలో భారత్, విండీస్ సమానంగా ఉన్నాయి.
ఇప్పుడిక తర్వాత మ్యాచులో సఫారీలను ఓడిస్తేనే భారత్ మిగతా గణాంకాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మరి ఆదివారం నాటి కీలక మ్యాచులో మన మహిళామణులు ఏ మేరకు రాణిస్తారో చూడాలి...