
90వ దశకంలో పాకిస్తాన్ ఓపెనర్ గా రాణించిన ఆ జట్టు ఓపెనర్ సయీద్ అన్వర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మోడీని ‘సైతాన్’అని సంభోదించాడు. ఓ మసీదులో అన్వర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ అన్టోల్డ్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం అన్వర్ మోడీని ఉద్దేశిస్తూ.. ‘ఆజాన్ (ముస్లింల ప్రార్థన) వచ్చేప్పుడు మీరు ఎన్నిసార్లు మీ ప్రసంగాలను ఆపినా మీరు సైతాన్ పట్టిన హిందూవుగానే మిగిలిపోతారు..’అని కామెంట్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మోడీ ఓ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రసంగిస్తుండగా సమీపంలో ఉన్న ఓ మసీదులో ఆజాన్ వచ్చింది. అప్పుడు మోడీ.. తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలుపుదల చేశారు. మోడీతో పాటు గతేడాది జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా కూడా మసీదు నుంచి ఆజాన్ వినపడగానే తన ప్రసంగాన్ని ఆపేశారు.
ఇతర మతాలను గౌరవిస్తూ మోడీ, షా లు ఇలా చేశారు. ఈ ఇద్దరూ ఇలా చేసినందుకు దేశంలోనే గాక ఇతర దేశాల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ అన్వర్ మాత్రం దీనిలో తప్పులు వెతికే ప్రయత్నం చేయడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక మత పెద్దగా అవతారమెత్తిన అన్వర్.. ఇలా వ్యాఖ్యానించడం మంచిది కాదని ట్విటర్ వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరైతే.. ‘సదరు అన్వర్ అనే క్రికెటర్ భారత్ కు వచ్చినప్పుడు అతడి ఆటను అభిమానించాం. అతడి ప్రదర్శనలకు ఫిదా అయ్యాం. ఇప్పుడు అదే వ్యక్తి తన దేశంలో ఇతర దేశంపై ద్వేషపూరిత ప్రసంగాన్ని నూరిపోస్తున్నాడు. లోకం తెలిసినోడే ఇలా ఉంటే ఇంక సాధారణ ప్రజల సంగతేంటో అర్థం చేసుకోవచ్చు...’అని కామెంట్స్ చేస్తున్నారు.
అన్వర్ 1989 నుంచి 2003 వరకు పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్ లో 55 టెస్టులు, 247 వన్డేలు ఆడాడు. టెస్టులలో 4,052 పరుగులు, వన్డేలలో 8,824 రన్స్ చేశాడు. వన్డేలలో 20 సెంచరీలు చేసిన అన్వర్.. 194 పరుగులతో భారత్ పై అత్యధిక స్కోరు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికాపై గ్వాలియర్ లో డబుల్ సెంచరీ చేసేదాకా అంతర్జాతీయ క్రికెట్ లో ఇదే హయ్యస్ట్ స్కోరుగా ఉంది.