
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2022లో లాహోర్ ఖలాండర్స్, ఫెషావర్ జాల్మీల మధ్య జరిగిన మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు టాప్ క్లాస్ ఆటగాళ్లు ఓ ఈజీ క్యాచ్ డ్రాప్ చేసి తర్వాత ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకున్నారు. ఈ మ్యాచులో రెండు క్యాచులను నేలపాలు చేసిన ఫఖర్ జమాన్ అయితే ఏకంగా తన ప్రొఫైల్ పిక్ నే క్యాచ్ మిస్ చేస్తున్న ఫోటోను పెట్టుకున్నాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
పీఎస్ఎల్ లో లాహోర్ ఖలాండర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఫెషావర్ జాల్మీ శాయశక్తులా పోరాడుతున్నది. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటర్ హైదర్ అలీ భారీ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి అక్కడే పైకి లేచింది. దీంతో ఆఫ్ సైడ్ లో ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ హఫీజ్, ఫఖర్ జమాన్ లు క్యాచ్ కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో ‘నువ్వు పట్టు..’ అంటే ‘నువ్వు పట్టు..’ అనుకుని ఇద్దరూ కలిసి క్యాచ్ నేలపాలు చేశారు.
అయితే మ్యాచ్ అనంతరం ఇద్దరూ కలిసి ఈ క్యాచ్ గురించే చర్చించుకున్నారు. టీమ్ మేట్స్ అందరూ కలిసి ముచ్చటించారు. ఈ క్రమంలో హఫీజ్ మాట్లాడుతూ.. ‘అతడు ఇది నా క్యాచ్ అన్నాడు. కానీ నేను మాత్రం లేదు.. ఇది నా క్యాచ్ అని చెప్పాను.. ’ అని చెప్పగా దానికి జమాన్ స్పందిస్తూ.. ‘నువ్వు ఈ క్యాచ్ నాది అన్నావు కదా.. కానీ నన్ను నమ్ము హఫీజ్ బాయ్.. నేను నా మైండ్ లో ఈ క్యాచ్ నాదే అనుకున్నా...’అని తెలిపాడు.
జమాన్, హఫీజ్ కలిసి మిస్ చేసిన క్యాచ్ తో పాటు ఈ ఇద్దరు ముచ్చటించుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా ఈ మ్యాచులో హైదర్ అలీ ఇచ్చిన క్యాచ్ ను మిస్ చేసిన ఫఖర్ జమాన్.. తర్వాత ఓవర్ లో రూథర్ఫర్డ్ ను మెరుపువేగంతో రనౌట్ చేయడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలాండర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఫెషావర్ జాల్మీ జట్టు.. పూర్తి ఓవర్లు ఆడినా 170 పరుగులకే పరిమితమైంది. హైదర్ అలీ (49), కమ్రాన్ అక్మల్ (21) లు మెరుపులు మెరిపించినా మ్యాచ్ మాత్రం లాహోర్ ఖలాండర్స్ నే వరించింది. లాహోర్ బౌలర్ జమాన్ ఖాన్.. నాలుగు వికెట్లు పడగొట్టాడు.