
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ముగిసిన ఫైనల్లో భారత జట్టు 9 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ తహిలా మెక్గ్రాత్కు కరోనా వచ్చినా ఆడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టీమిండియా ఫ్యాన్స్ కూడా ఈ వివాదంపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ అన్నా లానింగ్ ఈ విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చింది. మెక్గ్రాత్ ఆడటం వల్లే టీమిండియా ఓడిందా..? అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అన్నా లానింగ్ స్వతహాగా క్రికెటర్. ఆమె ఆసీస్ మహిళల క్రికెట్ జట్టు సారథి మెగ్ లానింగ్ సోదరి. తాజాగా ఆమె మెక్గ్రాత్ పై జరుగుతున్న చర్చపై ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్ లో ఆమె చేసింది 2 పరుగులు. బౌలింగ్ చేస్తూ 2 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చింది. ఈ మ్యాచ్ లో ఆమె ఏమైనా లాభం చేసిందంటే అది టీమిండియాకే.. అంతేగానీ కోవిడ్ వచ్చినా ఆమె ఆడి ఆసీస్ జట్టుకు భారీగా లబ్ది చేకూర్చిందేమీ లేదు..’ అని ట్వీట్ చేసింది.
ఫైనల్ కు ముందు మెక్గ్రాత్ కరోనా బారిన పడ్డా యూకే వైద్యాధికారులు, కామన్వెల్త్ నిర్వాహకులతో మాట్లాడిన తర్వాత ఆమెను ఈ మ్యాచ్ ఆడించారు. ఆసీస్ బ్యాటింగ్ చేసేప్పుడు ఆమె తన టీమ్ మేట్స్ తో కాకుండా వేరే స్టాండ్స్ లో కూర్చున్నది. అక్కడ మాస్కు పెట్టుకుని ఉంది. కానీ బ్యాటింగ్ చేసే సమయంలో ఆమె తన మాస్కును పక్కనబెట్టి క్రీజులోకి వచ్చింది. బ్యాటింగ్ లో ఆమె 2 పరుగులే చేసి నిష్క్రమించింది.
ఇక ఆసీస్ బౌలింగ్ చేస్తున్న సమయంలో కూడా ఆమె మాస్కు ధరించలేదు. అదీగాక రెండు ఓవర్లు బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఆమె బంతిని ఇతర ప్లేయర్లకు అందించడం.. వారితో దగ్గరగా మాట్లాడటం వంటివి చేసింది. దీనిపైనే భారత అభిమానులతో పాటు క్రీడాభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. అందరికీ ఒక రూల్..? ఆస్ట్రేలియాకు ఒక రూలా..? అని కామెంట్ చేశారు. సాధారణంగా ఎవరైనా ఆటగాడు కరోనా బారిన పడితే వాళ్లు మళ్లీ కరోనా నెగిటివ్ వచ్చేదాకా క్వారంటైన్ లోనే ఉండాలి. కానీ మెక్గ్రాత్ మాత్రం ఏకంగా మ్యాచ్ ఆడటం గమనార్హం.
ఇక స్వర్ణం కోసం జరిగిన పోరులో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేయగా.. భారత జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ ముందు బాగానే ఆడినా తర్వాత తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి విజయాన్ని దూరం చేసుకుని రజతంతో సరిపెట్టుకుంది.