
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో తొలి సీజన్ వచ్చే నెల 4 నుంచి ముంబై వేదికగా జరుగునున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న యూపీ వారియర్స్ టీమ్ తమ కెప్టెన్, వైస్ కెప్టెన్ లను పరిచయం చేశాయి. తొలి సీజన్ కు టైమ్ దగ్గరపడుతుండటంతో మిగతా జట్లు ఇప్పటికే కెప్టెన్ లను ప్రకటించిన నేపథ్యంలో యూపీ వారియర్స్ కూడా కీలక ప్రకటన చేసింది.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో యూపీ వారియర్స్ కు ఆస్ట్రేలియా క్రికెటర్ అలీస్సా హీలి సారథిగా వ్యవహరించనుంది. టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ వైస్ కెప్టెన్ గా ఉండనుంది. భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న దీప్తి.. ఇప్పుడు సరికొత్త రోల్ లో ఆడనుండటంతో ఆమెపై అంచనాలు పెరిగాయి.
దేశవాళీ, జాతీయ జట్టుతో పాటు దీప్తి గతంలో వెస్ట్రన్ స్టోర్మ్ (సూపర్ లీగ్), సిడ్నీ థండర్స్ (ఉమెన్స్ బీబీఎల్), బర్మింగ్హామ్ ఫోనిక్స్, లండన్ స్పిరిట్ (ది హండ్రెడ్) లలో ఆడింది. మొత్తంగా భారత్ బయట వివిధ ఫ్రాంచైజీలలో 30 మ్యాచ్ లు ఆడిన దీప్తి.. 32 వికెట్లు తీయడమే గాక 394 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్ ప్రారంభ లీగ్ లో కూడా దీప్తి మెరుపులు మెరిపించాలని యూపీ వారియర్స్ కోరుకుంటున్నది.
ఇక అంతర్జాతీయ క్రికెట్ లో దీప్తి.. భారత్ తరఫున 2 టెస్టులు, 80 వన్డేలు, 89 టీ20లు ఆడింది. టీ20లలో 914 రన్స్ చేసి వంద వికెట్లు తీసింది. భారత్ తరఫున టీ20లలో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్ దీప్తియే. వన్డేలలో 1,891 రన్స్ చేసి 91 వికెట్లు పడగొట్టింది. టెస్టులలో 152 పరుగులు సాధించి ఐదు వికెట్లు తీసింది.
ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్ లో కెప్టెన్లు
ఆర్సీబీ : స్మృతి మంధాన
ముంబై : హర్మన్ప్రీత్ కౌర్
యూపీ : అలీస్సా హీలి
ఢిల్లీ : ప్రకటించాల్సి ఉంది
గుజరాత్ : ప్రకటించాల్సి ఉంది.
ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ భార్య ఇయాన్ హీలి ఆ జట్టు తరఫున ఆరు టెస్టులు, 94 వన్దేలు, 123 టీ20లు ఆడింది. టీ20లలో 2,136 పరుగులు, వన్డేలలో 2,639 రన్స్ చేసింది. వన్డేలలో ఐదు, టీ20లలో ఒక సెంచరీ సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలందిస్తున్న ఆమె.. యూపీ వారియర్స్ కు సారథిగా వ్యవహరించనుంది.