
ఐపిఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ కు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ(ఉప్పల్) స్టేడియం ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకుని ప్రముఖ హోటల్లలో బస చేశారు. అయితే ఇలా తమ జట్టు బస చేసిన ఐటిసి కాకతీయ పై చెన్నై ఆటగాడు హర్బజన్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
తాను వివిధ నగరాల్లోని ఐటిసి కాకతీయ హోటల్లలో బసచేశానని....కానీ హైదరాబాద్ హోటల్లోనే అత్యంత చెత్త సర్వీస్ కనిపించిందన్నాడు. అసలు అతిథులు కోరిన ఆహారాన్ని, రూమ్ సర్వీస్ కల్పించడంలో హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించారని తెలిపాడు. అందువల్లే హైదరాబాద్ ఐటిసి అంటేనే తనకు విరక్తి కలుగుతోందన్నారు. అతిథులకు మెరుగైన సర్వీస్ అందించడాన్ని వదిలేసి వేరే విషయాల్లో హోటల్ సిబ్బంది నిమగ్నమవడం దురదృష్టకరమన్నారు. తానెంతో ఇష్టపడే హోటల్లో ఇలాంటి చేధు అనుభవం ఎదురయ్యిందంటూ హర్భజన్ ఆగ్రహంతో ట్వీట్ చేశాడు.
అయితే హైదరాబాద్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ హోటల్ నుండి వెళ్లిపోయే సమయంలో మాత్రం హర్భజన్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. గతంలో ఈ హోటల్ సేవలను అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయనే ఈసారి పొగుడుతూ ట్వీట్ చేశాడు. '' థ్యాంక్యూ ఐటిసి...మీ ఆతిథ్యం నాకెంతో నచ్చింది. త్వరలో మరోసారి ఇక్కడికే రావాలని కోరుకుంటున్నా. దేశవ్యాప్తంగా వున్న మీ హోటల్లలో నాకు చాలామంది ప్రెండ్స్ వున్నారు. మీతో ఈ బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.