కరోనా దెబ్బ: క్రికెటర్లకు జీతాలు లేవు, అయోమయంలో ఆటగాళ్లు!

By Sree sFirst Published Apr 24, 2020, 10:45 AM IST
Highlights

బోర్డులు నష్టాల బాట పట్టడంతో వారు క్రికెటర్లకు జీతాలు చెల్లించలేకపోతున్నారు. మ్యాచులు లేవు. దానితో ఆదాయం లేకపోవడంతో బోర్డులు సైతం ఏమీ చేయలేక నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నాయి. 

కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచదేశాలన్ని, ఈ మహమ్మారిపై యుద్ధం ఎలా సాగించాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నాయి. 

ప్రజల ప్రాణాలను ఈ మహమ్మారి పంజా నుండి కాపాడుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే ఏకైక మార్గం అని ఒక నిర్ణయానికి వచ్చి, ఆర్థికంగా వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నా లాక్ డౌన్ ను విధించేశాయి. 

ఈ లాక్ డౌన్ వల్ల ఇప్పటికే అన్ని క్రీడా సంరంభాలు కూడా వాయిదా పడ్డాయి. షూటింగ్ ఛాంపియన్షిప్ నుంచి ఐపీఎల్ వరకు అన్ని ఈవెంట్లు వాయిదా పడ్డాయి. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడా సంరంభం ఒలింపిక్స్ కూడా ఈ వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 

ఇలా సిరీస్ లే రద్దు అవుతున్న వేళ ద్వైపాక్షిక సిరీస్ ల గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఇలా అన్ని సిరీస్ లు రద్దవుతుండడంతో క్రికెట్ బోర్డులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. 

ఇలా బోర్డులు నష్టాల బాట పట్టడంతో వారు క్రికెటర్లకు జీతాలు చెల్లించలేకపోతున్నారు. మ్యాచులు లేవు. దానితో ఆదాయం లేకపోవడంతో బోర్డులు సైతం ఏమీ చేయలేక నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నాయి. 

తాజాగా కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఆట ఆగిపోవటంతో ఆదాయం నిలిచిపోయింది. ఈ కష్టకాలంలో క్రికెటర్లకు మ్యాచు ఫీజులు చెల్లించలేని దుస్థితిలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఉంది. 

వెస్టిండీస్‌ మహిళా క్రికెటర్లు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన నాలుగు మ్యాచులకు ఫీజులు అందుకోలేదు. ఐసీసీ నుంచి ప్రైజ్‌మనీ అందినా, మ్యాచ్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఇక మెన్స్‌ క్రికెటర్లు ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20.. శ్రీలంకతో మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడారు. 

ఆ మ్యాచులకు క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు అందాల్సి ఉంది. 2018లో శ్రీలంక జట్టు కరీబియన్‌ దీవుల్లో పర్యటించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు సైతం విండీస్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఈ రెండు సిరీస్‌లకు ప్రసార హక్కుల రూపంలో విండీస్‌ బోర్డుకు రూ. 20 కోట్లు మాత్రమే లభించినట్టు తెలుస్తోంది. 

ఈ రెండు సిరీస్‌ల నిర్వహణతో విండీస్‌ బోర్డు సుమారుగా రూ. 150 కోట్ల వరకు నష్టపోయినట్టు సమాచారం. గతంలో స్వదేశీ సీజన్‌తోనే బాగా నష్టపోయిన విండీస్‌, ఇప్పుడు పూర్తిగా ఆట నిలిచిపోవటంతో మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుంది

click me!