
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ కు ఊరట. తన వ్యక్తిగత కోచ్లను మానసికంగా వేధిస్తున్నారని, వారికి అక్రిడేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆమె చేసిన ఆరోపణలపై భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) స్పందించింది. లవ్లీనా వ్యక్తిగత కోచ్ సంధ్య గురున్ను కామన్వెల్త్ క్రీడా గ్రామంలోని అనుమతినిప్పించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని సంధ్యకు అక్రిడేషన్ వచ్చేలా కృషి చేసింది.
సోమవారం సాయంత్రం లవ్లీనా తన సామాజిక మాధ్యమ ఖాతాల వేదికగా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన కోచ్ లను పదే పదే మారుస్తున్నారని, ఆ కారణంగా తన శిక్షణ సరిగా జరగడం లేదని ఆరోపించించింది. తన ఇద్దరు కోచ్ లను వేధిస్తున్నారని ఆమె అందులో పేర్కొంది.
ట్విటర్ లో లవ్లీనా స్పందిస్తూ.. ‘బరువెక్కిన హృదయంతో నాపై కొనసాగుతున్న వేధింపులను అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. నేను అనేక వేధింపులను ఎదుర్కొంటున్నా. ఒలింపిక్స్లో నేను పతకం గెలవడానికి సహయపడిన కోచ్లను మాటిమాటికీ మారుస్తూ నా ట్రైయినింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగనివ్వడం లేదు. ట్రైయినింగ్లోనే కాదు, కాంపీటీషన్స్లోనూ నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. నా కోచ్ సంధ్యా గురున్జీ ద్రోణాచార్య అవార్డు కూడా గెలిచారు. చేతులు మొక్కి వేడుకుంటే చాలా ఆలస్యంగా నా వ్యక్తిగత (ఇద్దరు) కోచ్లను ట్రైయినింగ్ కోసం క్యాంప్కి పంపించారు.
నా కోచ్ సంధ్యా గురున్జీకి కామన్వెల్త్ విలేజ్కి ఎంట్రీ దొరకలేదు. మరో కోచ్ ను భారత్ కు పంపించారు. ఇది నా ట్రైనింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. వీళ్ల వల్ల వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా సరిగ్గా ఆడలేకపోయా. ఈ రాజకీయాలను అధిగమించి నా దేశానికి పతకం తేవాలని ఆశపడుతున్నా. జై హింద్’ అని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేసింది.
లవ్లీనా ఈ ట్వీట్ చేసిన వెంటనే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఐవోఏ ప్రత్యేక చొరవ తీసుకుని సంధ్యకు అక్రిడేషన్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. పేరు చెప్పకున్నా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులపై లవ్లీనా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.