
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మలపై వెటరన్ వికెట్ కీపర వృద్ధిమాన్ సాహా చేసిన కామెంట్లపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ముగ్గురిపై సాహా చేసిన కామెంట్లపై వివరణ కోరనున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐలో ఉన్నంతకాలం జట్టులో సాహా స్థానానికి డోకాలేదని గంగూలీ తనతో చెప్పాడని, కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అతడు ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ద్రావిడ్ తనను రిటైర్ కావాలని ద్రావిడ్ సూచించాడని కూడా సాహా ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ఇదే విషయమై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ... ‘‘అవును. వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాలని బీసీసీఐ భావిస్తున్నది. జట్టు సెలెక్షన్ విషయాలతో పాటు డ్రెస్సింగ్ రూమ్ వివరాలను బయటపెట్టినందుకు గాను అతడిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఇక గంగూలీ.. సాహాతో చెప్పిన విషయాల గురించి కూడా అతడు బహిర్గతంగా చెప్పి ఉండకూడదు. బహుశా సాహాను మోటివేట్ చేయడానికి గంగూలీ అలా చెప్పి ఉంటాడు. అయితే గత కొద్దికాలంగా మేము ఇతర పనుల్లో బిజీగా గడుపుతున్నాం. సాహా విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం..’ అని తెలిపాడు.
అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సాహాకు బీసీసీఐ షోకాజ్ నోటీసులు గానీ డైరెక్ట్ గా పిలిచి వివరణ కోరడం గానీ చేయవచ్చు అని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ ఆన్యూవల్ కాంట్రాక్ట్ లో గ్రూప్-బి (రూ. 3 కోట్లు)లో ఉన్న సాహా.. ఆ నియమాలను అతిక్రమించాడని బోర్డు ఆరోపిస్తున్నది. బీసీసీఐతో కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్లు.. ‘ఆట గురించి గానీ, ఆటకు సంబంధించిన విషయాలు.. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన విషయాలు, జట్టు వ్యూహాలు, వాడిన టెక్నాలజీ, సెలక్షన్ మ్యాటర్స్, ఆటకు సంబంధించిన ఇతర విషయాలపై బయట మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడితే అది చట్టరీత్యా నేరం..’ గా పరిగణిస్తున్నది బీసీసీఐ..
ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా సాహాను జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాహా మాట్లాడుతూ.. నేను ఇక్కడున్నంత కాలం నీకు జట్టులో డోకా లేదని దాదా (సౌరవ్ గంగూలీ) నాకు చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటలు నాకు మానసిక బలాన్నిచ్చాయి. సౌతాఫ్రికాతో పర్యటనలో నేను ఎంపికైన కూడా మూడు టెస్టులకు బెంచ్ మీదే ఉన్నా. దీంతో నేను షాక్ కు గురయ్యా. గంగూలీ నాకు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. ఒక టెస్టు సిరీస్ తో ఏం జరిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నా వయసు అయిపోతుందా..? లేక మరేమైనా సమస్యా..? నాకు తెలియదు..’ అని గంగూలీని ఉద్దేశిస్తూ అన్నాడు.
ఇక ద్రావిడ్ పై..‘ శ్రీలంక పర్యటనకు ముందే ద్రావిడ్ కూడా నాతో మాట్లాడాడు. తదుపరి సిరీస్ లలో నిన్ను ఎంపిక చేయకపోవచ్చుననే చర్చలు కూడా జరుగుతున్నాయి అని చెప్పాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని ద్రావిడ్ అన్నాడు. ఆ నిర్ణయం రిటైర్మెంటే.. అదే విషయాన్ని ద్రావిడ్ పరోక్షంగా చెప్పాడు..’ ఇలా స్పందించాడు సాహా..
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ గురించి స్పందిస్తూ.. ‘శ్రీలంకతో టెస్టు సిరీస్ కోసం ఎంపిక ప్రక్రియ ప్రారంభమవడానికి కొద్ది రోజుల ముందు చేతన్ శర్మ (బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చీఫ్) నుంచి నాకు ఫోన్ వచ్చింది. నన్ను శ్రీలంక సిరీస్ కు ఎంపిక చేయడం లేదని అతడు నాతో చెప్పాడు. అప్పుడు నేను.. ఒక్క శ్రీలంక సిరీస్ కేనా..? లేక తదుపరి సిరీస్ లకు కూడానా..? అని అడిగాను. దానికి చేతన్ కాసేపు ఆగి.. ఇకనుంచి నిన్ను పరిగణలోకి తీసుకోబోం..’ అని స్పష్టం చేశాడు.