
ఆసియా క్రీడలు 2023 పోటీల్లో క్రికెట్ కూడా భాగమైంది. చైనాలోని హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 7 వరకూ ఏషియన్ గేమ్స్ జరగబోతున్నాయి. ఇందులో భారత మహిళా క్రికెట్ టీమ్తో పాటు పురుషుల జట్టు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా భారత క్రికెట్ జట్లు (మెన్స్, ఉమెన్స్) ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నట్టు సమాచారం...
2014 తర్వాత తొలిసారిగా ఏషియన్ గేమ్స్లో క్రికెట్ని భాగం చేశారు. టీ20 ఫార్మాట్లో జరగబోయే ఆసియా క్రీడా క్రికెట్ సమరం, టీమిండియాకి కొత్త చిక్కులను తెచ్చి పెట్టింది. సెప్టెంబర్ 23న ఆసియా క్రీడలు ప్రారంభం అవుతుంటే అక్టోబర్ 5న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది...
రెండు టోర్నీల్లో పాల్గొనడం అయ్యే పని కాదు, దీంతో ఆసియా క్రీడలకు ప్రధాన జట్టును కాకుండా బీ టీమ్ని పంపించాలని ప్రయత్నాలు చేసిందట బీసీసీఐ. అయితే ఆసియా క్రీడల్లో పాల్గొనే ప్లేయర్లను జూన్ 30లోగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి పంపించాల్సి ఉంటుంది...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని దృష్టిలో పెట్టుకుని, ఇంత త్వరగా బీ టీమ్ లిస్టును సిద్ధం చేయడం కాని పనని భావించిన బీసీసీఐ, ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతకుముందు 2010, 2014 ఎడిషన్లలో కూడా ఆసియా గేమ్స్లో క్రికెట్ ఉండింది. అయితే ఈ రెండు సార్లు కూడా బిజీ షెడ్యూల్ కారణంగా భారత క్రికెట్ జట్టు, ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. జాకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో స్టేడియాల కొరత కారణంగా క్రికెట్ భాగంగా లేదు..
షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జరగాల్సిన ఏషియా గేమ్స్, కరోనా కారణంగా ఏడాది వాయిదా పడి 2023 సెప్టెంబర్లో జరుగుతున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన భారత మహిళా క్రికెట్ జట్టు, రన్నరప్తో సరిపెట్టుకుంది..
2022 ఉమెన్స్ ఆసియా కప్ గెలిచిన భారత మహిళా జట్టు, 2023 ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా తక్కువే. భారత మహిళా జట్టు కూడా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో బిజీగా ఉండడంతో ఆసియా గేమ్స్లో పాల్గొనడం అనుమానంగా మారింది..
‘ఆసియా క్రీడల్లో భారత్, ఒక్క క్రికెట్ తప్ప అన్ని క్రీడల్లోనూ పాల్గొనబోతోంది. బీసీసీఐకి ఇప్పటికే చాలాసార్లు మెయిల్స్ పంపించాం. అయితే ఆ సమయంలో బిజీ షెడ్యూల్ ఉండడంతో టీమ్స్ని పంపలేమని తేల్చి చెప్పేశారు..’ అని తెలిపాడు భారత ఆసియా గేమ్స్ మెషన్ చీఫ్ భూపేందర్ భజ్వా...
ఇంతకుముందు 1998లో భారత జట్టు ఒకేసారి రెండు టోర్నీల్లో పాల్గొంది. ఓ జట్టు కౌలంహపూర్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఆడితే, మరో జట్టు సహారా కప్లో పాకిస్తాన్తో మ్యాచులు ఆడింది. తాజాగా 2021లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు, లంకలో పర్యటిస్తే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మరో టీమ్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది..
ఆసియా క్రీడలకు అలా పంపే అవకాశం ఉన్నా, బీసీసీఐ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి టీమ్స్ కూడా ఏషియన్ గేమ్స్లో ఆడతాయో లేదో చూడాలి..