
ఐపీఎల్ - 15 సీజన్ ప్లేఆఫ్స్ కు చేరువైంది. ఈ వారం ముగిస్తే ప్లేఆఫ్స్ కు చేరే నాలుగు జట్లేవో దాదాపు ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ కు చేరగా ఆ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉంది. మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కూడా ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ కి ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఫ్రాంచైజీలు మ్యాచులు, సమీకరణాల గొడవలో ఉండగా.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం ఐపీఎల్ ముగింపు వేడుకలను ఘనంగా చేయాలని భావిస్తున్నది.
సాధారణంగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు వేడుకలను బీసీసీఐ భారీ స్థాయిలో నిర్వహించేది. కానీ కరోనా పుణ్యమా అని 2020 నుంచి ప్రేక్షకులకు ఆ సంబురాలు కరువయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు కూడా జరుగలేదు. కానీ కరోనా వ్యాప్తి నామమాత్రమవడం.. లీగ్ విజయవంతంగా కొనసాగుతుండటంతో ముగింపు ను మాత్రం ఘనంగా ముగించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.
ఏం చేయనుంది..?
ముగింపు వేడుకుల నిమిత్తం బీసీసీఐ.. మే 29న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటుడు, ఇటీవలే 83 సినిమాతో ప్రేక్షలకు అభిమానాన్ని చురగొన్న రణ్వీర్ సింగ్ తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎఆర్ రెహ్మాన్ తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనుంది బీసీసీఐ. ఈ మేరకు ఒక ఏజెన్సీకి ఇందుకు సంబంధించిన పనులను కూడా అప్పజెప్పింది. మే 29న ఫైనల్ కు ముందు 45 నిమిషాల పాటు ఈ ఇద్దరూ తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని టాక్. ఇందుకు గాను ఆ ఇద్దరికీ భారీగా ముట్టజెప్పడానికి కూడా బీసీసీఐ సిద్ధమైంది.
కెప్టెన్లందరికీ సన్మానం..
ఇటీవలే భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నది. 75 వసంతాల భారతావని లో టీమిండియాకు కెప్టెన్లు గా వ్యవహరించిన వారిని సత్కరించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ 75 ఏండ్లలో భారత క్రికెట్ ఎదుగుదల, ఆ ప్రయాణానికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించినట్టు సమాచారం. భారత జట్టు మాజీ సారథులందరినీ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసిందని వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఫైనల్ వేదికలివి..
మే 24న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో తొలి ప్లేఆఫ్స్ (క్వాలిఫైయర్ టీమ్ 1 వర్సెస్ టీమ్ 2) జరుగుతుంది. 25 మేన అదే స్టేడియంలో ఎలిమినేటర్ (టీమ్ 3 వర్సెస్ టీమ్ 4) ను నిర్వహిస్తారు. ఇక మే 27న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ (ఎలిమినేటర్ గేమ్ లో గెలుపొందిన జట్టు వర్సెస్ క్వాలిఫైయర్ 1 లో ఓటమి పొందిన జట్టు) జరగాల్సి ఉంది. ఇక మే 29న అదే స్టేడియంలో క్వాలిఫైయర్ 1 విజేత, క్వాలిఫైయర్ 2 విజేతల మధ్య ఫైనల్ జరుగుతుంది.