మొహాలీ టీ20: అభిమానుల అత్యుత్సాహం... బిసిసిఐ సీరియస్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Sep 22, 2019, 3:17 PM IST
Highlights

మొహాలీ వేదికన భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20లో భద్రతా వైపల్యం కొట్టొచ్చినట్లు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక క్రికెట్ అసోసియేషన్ పై బిసిసిఐ సీరియస్ అయ్యింది.  

భారత్-సౌతాఫ్రికా ల మధ్య జరుగుతున్న టీ20 సీరిస్ ఆటగాళ్ల భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. మొహాలీ వేదికన జరిగిన జరిగిన రెండో టీ20లో పలుమార్లు అభిమానులు మైదానంలోకి దూసుకురావడమే అందుకు కారణం. ఈ ఘటనతో ఆటగాళ్లకు కల్పించే భద్రతపై బిసిసిఐ అధికారుల్లో కూడా చర్చ మొదలైనట్లుంది. తాజాగా బిసిసిఐ అవినీతి నిరోధక విభాగాధిపతి అజిత్ సింగ్ దీనిపై స్పందిస్తూ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మొహాలీ వేదికన జరిగిన రెండో టీ20 మ్యాచ్ కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంలో స్థానిక క్రికెట్ అసోసియేషన్ విఫలమయ్యింది. అందువల్లే ఆటగాళ్ల పదేపదే మైదానంలోకి దూసుకురాగలిగారు. ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సింది పంజాబ్ క్రికెట్ అసోసియేషనే. హోటల్లో దిగినప్పటి నుండి మ్యాచ్ ముగించుకుని తిరుగుపయనమయ్యే వరకు ఆటగాళ్ళకు భద్రత కల్పించాల్సిన భాద్యత స్థానిక క్రికెట్ అసోసియేన్లదేనని అజిత్ సింగ్ స్ఫష్టం చేశారు. 

''ధర్మశాలలో జరగాల్సిన మొదటి టీ20  వర్షం కారణంగా రద్దవడం, ఆ తర్వాత కూడా ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో భారత ఆటగాళ్లు రెండు రోజుల ముందుగానే మొహాలీకి చేరుకున్నారు. అయితే ఈ విషయంపై తమకకు ముందస్తు సమాచారం లేదని...అప్పటికప్పుడు పోలీస్ సెక్యూరిటీని కల్పించడం కుదరదంటూ పంజాబ్ పోలీసులు తెలిపారు. దీంతో ఆటగాళ్లకు ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం అయినప్పటికి తప్పలేదు.

అయితే మ్యాచ్ మాత్రం పోలీసుల భద్రత మధ్యే జరిగింది. కానీ చాలీచాలని సెక్యూరిటీ అభిమానులకు మైదానంలోకి చొచ్చుకెళ్లకుండా అడ్డుకోలేకపోయారు. కొందరు అభిమానులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. బౌండరీల వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లే కాదు... ఏకంగా క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు కూడా దీనివల్ల ఇబ్బందిపడ్డారు. కాస్సేపు ఆటకు కూడా అంతరాయం కలిగింది. ఇలా జరగడం చాలా విచారకరం.

మొహాలీ టీ20  మ్యాచ్ తో పాటు ఆటగాళ్లకు  కల్పించిన భద్రతపై వివరణ ఇవ్వాల్సిందిగా  పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కు లేఖ రాశాం. అంతేకాకుండా ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీపడొద్దని ఇతర అసోసియేషన్లకు  కూడా సూచించాం.'' అని ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ వెల్లడించారు.   

సంబంధిత వార్తలు

  మొహాలీ టీ20లో భద్రతా వైఫల్యం... కోహ్లీవైపు దూసుకొచ్చిన అభిమాని

click me!