WPL 2023: దీప్తి శర్మకు షాక్... యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆసీస్ బ్యాటర్ అలిస్సా హీలీ...

Published : Feb 22, 2023, 04:14 PM IST
WPL 2023: దీప్తి శర్మకు షాక్... యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆసీస్ బ్యాటర్ అలిస్సా హీలీ...

సారాంశం

మహిళల ప్రీమియర్ లీగ్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) వేలంలో రూ.2 కోట్ల 60 లక్షలకు దీప్తి శర్మను దక్కించుకున్న యూపీ వారియర్స్.. రూ.70 లక్షలకు కొనుగోలు చేసిన ఆసీస్ వికెట్ కీపర్ అలిస్సా హీలికి కెప్టెన్సీ.. 

క్రికెట్ ఫ్యాన్స్‌ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2023 సీజన్ మరో 12 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్మృతి మంధానని కెప్టెన్‌గా ఎంచుకున్నట్టు ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ముంబై ఇండియన్స్ టీమ్‌కి టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షెఫాలీ వర్మ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. గుజరాత్ జెయింట్స్ టీమ్‌ ఎవరిని కెప్టెన్‌గా ఎంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది..

యూపీ వారియర్స్ టీమ్‌‌కి భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని అనుకున్నారంతా. అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అలిస్సా హీలీని కెప్టెన్‌గా ఎంచుకుంది యూపీ వారియర్స్ టీమ్ మేనేజ్‌మెంట్..

యూపీ వారియర్స్ టీమ్‌, భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో రూ.2 కోట్ల 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్‌ని రూ.1 కోటి 80 లక్షలకు, భారత ఆల్‌రౌండర్ దేవికా వైద్యని రూ.1 కోటి 40 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్ టీమ్... ఆసీస్ ఆల్‌రౌండర్ తహిళా మెక్‌గ్రాత్‌ని రూ.1 కోటి 40 లక్షలు పెట్టి దక్కించుకుంది..

సౌతాఫ్రికా బౌలర్ షబ్మం ఇస్మాయిల్ కోసం రూ.1 కోటి ఖర్చు చేసిన యూపీ వారియర్స్, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారీస్‌ని రూ.75 లక్షలకు, వికెట్ కీపర్ అలిస్సా హీలిని రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది..

యూపీ వారియర్స్ టీమ్‌లో భారత సీనియర్ బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్‌తో పాటు అండర్19 టీ20 వరల్డ్ కప్ 2023 స్టార్లు శ్వేతా సెహ్రావత్, పర్శవీ చోప్రా కూడా ఉన్నారు... 

డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌ని మార్చి 3న గుజరాత్ జెయింట్స్‌తో ఆడనుంది యూపీ వారియర్స్. ఆ తర్వాత మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో,  మార్చి 8న ఆర్‌సీబీతో, మార్చి 10న ముంబై ఇండియన్స్‌తో మ్యాచులు ఆడుతుంది యూపీ వారియర్స్.. 

మార్చి 13న ఆర్‌సీబీతో రెండో మ్యాచ్ ఆడే యూపీ వారియర్స్, మార్చి 15న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 17న గుజరాత్ జెయింట్స్‌తో ఆడనుంది. మార్చి 20న ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్‌తో గ్రూప్ మ్యాచులు ముగుస్తాయి..

మొట్టమొదటి పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ షేన్ వార్న్ టీమ్‌ పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగి ఛాంపియన్‌గా నిలిచింది. దీప్తి శర్మని కాదని, అలిస్సా హీలికి కెప్టెన్సీ ఇవ్వడం వెనక యూపీ వారియర్స్ ఆలోచన కూడా ఇదే అయ్యి ఉండొచ్చు. హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న అలిస్సా హీలి, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య. మరి ఈ మిసెస్ స్టార్క్, యూపీ వారియర్స్‌ని విజేతగా నిలపగలదో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !