
ఆసియా కప్-2022లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా ముగిసిన పోరులో భారత్ - పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది గతేడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ మీద ఓడినదానికి ప్రతీకారం తీర్చుకున్నది. అయితే మ్యాచ్ గెలిచాక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారతీయ అభిమానులు త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి భారత విజయాన్ని పండుగ చేసుకున్నారు. కానీ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మాత్రం జాతీయ జెండాను పట్టుకోవడానికి నిరాకరించాడు.
148 పరుగుల లక్ష్య ఛేదనలో మహ్మద్ నవాజ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి హార్ధిక్ పాండ్యా సిక్సర్ కొట్టడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్నవాళ్లంతా చేతులో తమ వద్ద ఉన్న త్రివర్ణ పతాకాన్ని చేతబూని సంబురాలు చేసుకున్నారు. అదే క్రమంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన జై షా కు అతడి పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. జాతీయ జెండాను అందించాడు. కానీ త్రివర్ణ పతాకాన్ని తాకడానికి జై షా నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
జై షా చేసిన పని అతడితో పాటు బీజేపీకీ ఇబ్బందులు తెచ్చింది.. బీజేపీ దేశభక్తి అంటే ఇదేనా..? అని విపక్షాలు ప్రశ్నల వర్షం కురుస్తున్నది. కాంగ్రెస్ కూడా జై షాకు సంబంధించిన వీడియోతో బీజేపీ దేశభక్తిపై ప్రశ్నలు సంధిస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం జై షా తీరును ఎండగట్టారు. ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ : అమిత్ షా కొడుకు జై షా జాతీయ జెండాను పట్టుకోవడానికి నిరాకరించాడు. భారత విజయాన్ని జై షా.. జాతీయ జెండాతో ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు..? ఇండియన్ ఫ్లాగ్ అంటే అతడికి అంత ఎలర్జీనా..?’ అని ట్వీట్ చేశారు.
అయితే ఈ వ్యహారంపై బీఫిట్టింగ్స్ ఫ్యాక్ట్స్ అనే పేరిట ఉన్న ఓ ట్విటర్ హ్యాండిల్ లో ఇందుకు సంబంధించిన వివరణ ఉంది. జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగానే గాక.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ హోదాలోనే అతడు మ్యాచ్ లు వీక్షిస్తున్నాడు. భారత్-పాక్ మ్యాచ్ అనంతరం అతడు జాతీయ జెండా పట్టుకోకపోవడానికీ అదే కారణమని అందులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆయన అన్ని దేశాలను సమదృష్టితో చూస్తాడని.. అందుకే భారత జాతీయ జెండాను పట్టుకోలేదని వివరణ ఇచ్చారు. ఆయన తప్పేమీ లేదని బీజేపీ, జై షా వర్గాలు సర్దిచెప్పుకుంటున్నా నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ జెండాతో పాటు భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుండగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వా కుమారుడి పక్కనే కూర్చున్నాడు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను నవజ్యోత్ సింగ్ సిద్ధూ హత్తుకుంటే తప్పుబట్టినవాళ్లు.. ఇప్పుడు ఏకంగా అదే పాక్ ఆర్మీ చీఫ్ కుమారుడు జై షా పక్కనకూర్చుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.