
రాక రాక వచ్చిన అతిథులను కంటికి రెప్పలా చూసుకుంటున్న పాకిస్థాన్ కు స్వదేశంలో సిరీస్ నిర్వహించడం అంత వీజీ కాదని తేల్చి చెప్పారు తీవ్రవాదులు. 24 ఏండ్ల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అక్కడి అంతర్గత తీవ్రవాద సంస్థలు ఆ సందేహాలను నిజం చేశాయి. పెషావర్ లో ఆత్మహుతి దాడి జరిపాయి. ఈ దాడిలో 30 మంది ఘటనాస్థలంలోనే అసువులు బాయగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. పాక్ తో తొలి టెస్టు ఆడుతున్న రావల్పిండికి పెషావర్ కు మధ్య దూరం 190 కిలోమీటర్లు.
1998లో పాక్ పర్యటనకు వచ్చిన ఆసీస్.. మళ్లీ ఇటీవలే ఆ దేశం కోరికను మన్నించి ఇక్కడకు వచ్చింది. అయితే సిరీస్ నిర్వహణ ఎలా సాగుతుందా..? అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అనుకున్నదే జరిగింది. పెషావర్ లోని కిస్సా ఖవానీ బజార్ లో గల కొచ రిసాల్దర్ ఏరియాలోని ఓ మసీదు లో బాంబు పేలింది.
శుక్రవారం కావడంతో ప్రార్థనలకు వెళ్లిన అమాయకులు బాంబుదాడిలో మరణించారు. అయితే సాయుధులై ఉన్న తీవ్రవాదులు.. ముందు ప్రజలపై కాల్పులు జరుపుదామని ప్రయత్నించినా.. అది వీలుకాకపోవడంతో ఆత్మాహుతికి దిగారని తెలుస్తున్నది. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ కూడా ఖండించారు. దేశంలో శాంతిని విచ్చిన్నం చేయడానికి విదేశాలతో కలిసి ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. గాయపడిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులన ఆస్పత్రులకు తరలించి తగిన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
టూర్ జరిగేనా..?
బాంబు దాడి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రాంతం రావల్పిండికి ఏమంత దూరం కాకపోవడంతో సీఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయితే పాక్ లో ఉన్న తమ ఆటగాళ్ల భద్రత గురించి ఆసీస్ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నది. భద్రతకు సంబంధించి ఏ ఆటగాడికి ఇబ్బంది కలిగినా తిరిగి స్వదేశానికి రావొచ్చని సీఏ సూచించినట్టు సమాచారం. అయితే బాంబు దాడి నేపథ్యంలో సీఏ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
పట్టు బిగిస్తున్న పాక్..
ఇదిలాఉండగా తొలి టెస్టు మొదటి రోజున పాక్ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బాబర్ ఆజమ్ సేన.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (127 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (44)ఫర్వాలేదనిపించాడు ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. అబ్దుల్లా నిష్క్రమణతో వచ్చిన అజర్ అలీ (59 బ్యాటింగ్) కలిసి ఇమామ్ ఇన్నింగ్సును నడిపిస్తున్నాడు.