
ఇంగ్లాండ్ తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ కోలుకుంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైన ఆ జట్టు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా అదే ఆటతో విమర్శలపాలైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆ జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్.. కివీస్ ను ఫాలో ఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం న్యూజిలాండ్ బ్యాటర్లు నిలదొక్కుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు ఫాలో ఆన్ ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
మూడో రోజు 138-7 వద్ద ఆట ఆరంభించిన కివీస్ ను కెప్టెన్ టిమ్ సౌథీ (49 బంతుల్లో 73, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆదుకున్నాడు. సౌథీ పోరాటంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61) లు తొలి వికెట్ కు 149 పరుగులు జోడించారు.
లాథమ్, కాన్వేలు ఇంగ్లాండ్ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ఈ జోడీని జాక్ లీచ్ విడదీశాడు. అతడు వేసిన 52వ ఓవర్లో ఐదో బంతికి కాన్వే.. ఓలీ పోప్ కు క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటి రూట్ బౌలింగ్ లో లాథమ్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. లీచ్.. విల్ యంగ్ (8) ను కూడా పెవిలియన్ కు పంపాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్.. 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
కివీస్ మాజీ టెస్టు సారథి కేన్ విలియమ్సన్.. (81 బంతుల్లో 25, 2 ఫోర్లు), హెన్రీ నికోలస్ (70 బంతుల్లో 18 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కూడా ఈ ఇద్దరు ఎంత ఎక్కువసేపు నిలిస్తే ఈ టెస్టులో కివీస్ కు మ్యాచ్ ను కాపాడుకునేందుకు అన్ని అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్ విజయం కోసం పోరాడటం అతిశయోక్తే గానీ ఇదివరకే తొలి టెస్టు ఓడిపోయిన ఆ జట్టు ఈ టెస్టు కూడా ఓడకుండా ఉండాలంటే నాలుగో రోజు వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలి.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసిన విషయం తెలిసిందే. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153)లు సెంచరీలతో కదం తొక్కారు.