కరోనా భయం: పట్టించుకోని బంధువులు.. అందరూ ఉన్నా చెత్తబండిలో అనాథ శవంలా

By Siva KodatiFirst Published Mar 27, 2020, 3:35 PM IST
Highlights

పెద్దపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మరణించగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంలా అధికారులే దహన సంస్కారాలు నిర్వహించారు.

కరోనా కారణంగా మనుషుల మధ్య సామాజిక సంబంధాలు దారుణంగా క్షీణిస్తున్నాయి. మొన్నామధ్యా కరీంనగర్‌లో కూరగాయలు కొనడానికి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటు కారణంగా మరణించగా అక్కడే వున్న జనం కనీసం శవాన్ని ముట్టుకోకుండా వదిలేశారు. చివరికి అధికారులు వచ్చి ఆయన భౌతికకాయన్ని తరలించారు.

తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మరణించగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంలా అధికారులే దహన సంస్కారాలు నిర్వహించారు.

Also Read:దేశం లాక్ డౌన్... ఇంటికి వెళ్లడానికి రెండు రోజుల్లో 115కిలోమీటర్లు..

వివరాల్లోకి వెళితే... ధర్మారం మండల నందిమేడారానికి చెందిన కొసరి అంజయ్య, రాజవ్వ భార్యాభర్తలు, వీరికి సంతానం లేదు. రెండు నెలల క్రితం అంజయ్య చనిపోయారు. భర్త మరణం, ఒంటరితనంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన రాజవ్వ గురువారం మరణించింది.

ఈ విషయాన్ని స్ధానికులు ఆమె బంధువులకు అందించారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పాటు అందరినీ భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో 24 గంటలు గడిచినా బంధువులు ఎవ్వరూ రాకపోవడంతో చివరికి గ్రామ పంచాయతీ అధికారులే రంగంలోకి దిగారు.

Also Read:లక్షణాలు లేకుండానే కరోనా.. బాధితుడు ఏం చెప్పాడంటే...

సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్త బండిలో అంతిమయాత్రగా తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా కారణంగా రాజవ్వ ఒక అనాథగా తరలిపోవడం చూసి గ్రామస్థులు, పరిచయస్తులు కంటతడి పెట్టారు. 

click me!