గాలి నుండి ఆక్సిజన్ తయారు చేసే యంత్రం: టిమ్స్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Apr 25, 2021, 11:20 AM IST
Highlights

గాలి నుండి ఆక్సిజన్ తయారు చేసే యంత్రం టిమ్స్ కు మంజూరైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
 

హైదరాబాద్: గాలి నుండి ఆక్సిజన్ తయారు చేసే యంత్రం టిమ్స్ కు మంజూరైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.ఆదివారం నాడు  హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.   ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ కారణంగా ఈ యంత్రం ఇంకా రాలేదని ఆయన చెప్పారు. 

also read:తెలంగాణలో కరోనా ఉధృతి: 24 గంటల్లో 8,126 కేసులు, 38 మంది మృతి

ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ స్థానంలో మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేయాలని కేంద్ర ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ యూనిట్లకు అదనంగా దేశంలో మరో 300 కొత్త ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆయన చెప్పారు. 

దేశంలో  కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు  కేంద్రం అన్ని చర్యలు తీసుకొంటుందన్నారు. అయితే కేంద్రంపై విమర్శలు మానుకోవాలని ఆయన విపక్షాలకు సూచించారు. కరోనా లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని  మంత్రి సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్స్ కొరత లేదని ఆయన చెప్పారు. డిజాస్టర్ మేనేజ్ ‌మెంట్ నిధులను ఉపయోగించుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.  ఇతర దేశాల నుండి కూడ ఆక్సిజన్ ను తెప్పిస్తున్నామని ఆయన వివరించారు.

 ఆసుపత్రుల్లో బెడ్స్ కంటే ఎక్కువ సంఖ్యలో జనం కరోనా బారినపడుతున్నారని ఈ కారణంగానే  కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. టిమ్స్ లో సిబ్బంది నియామకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్ఆర్‌బిఎం మాస్కుల కొరత లేకుండా చూడాలన్నారు. 

click me!