పారిశుద్ధ్య కార్మికులకు కేసీఆర్ శుభవార్త: పూర్తి వేతనం... రూ.5 వేలు కానుక

By Siva KodatiFirst Published Apr 6, 2020, 9:01 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అనిర్వచనీయం. ఈ నేపథ్యంలో తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు

భారతదేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అనిర్వచనీయం. ఈ నేపథ్యంలో తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.

సోమవారం కరోనా ప్రభావం, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు 95,392 మందికి వేతనంలో కొతను ఉపసంహరించుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

Also Read:కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది, జాగ్రత్త: సీఎం హెచ్చరిక

అంతేకాకుండా సీఎం ప్రోత్సాహం కింద మున్సిపల్, గ్రామ పంచాయతీలలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 వేలు ఇస్తామన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు రూ.7,500 ఇస్తామని చంద్రశేఖర్ రావు తెలిపారు.

పారిశుద్ధ్య పనులు ఇంకా బాగా కొనసాగితే వైరస్ వ్యాప్తిని నియంత్రించొచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు కరోనాపై పోరులో భాగంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పోటెత్తుతున్నాయి.

కోటీశ్వరుల నుంచి రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు కూడా తాము సైతం అంటున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న చిరుద్యోగులు తమ జీతాల్లోంచి కొంత తీసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

Also Read:ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందే: కేసీఆర్

మొత్తం 17,261 మంది ఐకేపీ వీఓఏలు తమ నెల జీతం రూ.5,000 నుంచి ఒక్కొక్కరు ఒక్కో వెయ్యి రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ వీఓఏలను, వారిని సమన్వయం చేసిన వీఓఏల సంఘాన్ని, టీఆర్ఎస్ కార్మిక విభాగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు అభినందించారు. 

click me!