తెలుగు రాష్ట్రాలపై నిజాముద్దీన్ బాంబు: ఢిల్లీ నుంచే కారోనా వ్యాప్తి

By telugu teamFirst Published Mar 31, 2020, 9:29 AM IST
Highlights

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చినవారే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రమాదంగా పరిణమించినట్లు గుర్తించారు. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రాలు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. రెండు రాష్ట్రాలు కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం నుంచి వచ్చినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగ్ - ఏ - జమాత్ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. 

ఆ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్లినవారున్నారు. తెలంగాణలోని సంభవించిన ఆరు మరణాల్లో నాలుగు నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి వచ్చినవారేనని తెలుస్తోంది. ఈ స్థితిలో ఆదిలాబాద్ చెక్ పోస్టు వద్ద 32 మందిని అధికారులు అడ్డుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలోని విజయవాడలో వెలుగు చూసిన కరోనా కేసుల మూలాలు కూడా ఢిల్లీకి చెందినవేనని తెలుస్తోంది.  రాజమండ్రిలోని శాంతి నగర్ లో కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తూర్పు గోదావరి జిల్లాలో 26 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్ చుట్టుపక్కలవారిలో ఆదివారం రాత్రి కరోనిా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు , వైద్యులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అనుమానితులను బస్సుల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తు్నారు. 

నిజాముద్దీన్ సమావేశానికి ఇండోనేషియా, మలేసియా, సౌదీ అరేబియా, కజకిస్తాన్ ల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. మొత్తం 2 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ చాలా మంది బస చేశారు. ఆరు అంతస్థుల డార్మిటరీలో 280 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రతినిధుల్లో 300 మందికి కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆస్పత్రులకు తరలించారు. 175 మందిని పరీక్షించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. 

లాక్ డౌన్ ను పట్టించుకోకుండా, ఒకే చోట వందల మంది ఉన్నందుకు సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేశారు. నిజాముద్దీన్ ప్రాంతమంతా ప్రమాదంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

click me!