నిర్మల్ లో కరోనాతో వ్యక్తి మృతి: ఆదిలాబాదులో ఆశావర్కర్లపై దాడి

By telugu teamFirst Published Apr 3, 2020, 5:45 PM IST
Highlights

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మరణించాడు. దీంతో నిర్మల్ పట్టణంలో వేలాది మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆశావర్కర్లపై దాడి జరిగింది.

హైదరాబాద్: తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. దీంతో వేలాది మందికి నిర్మల్ పట్టణంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తి నివసించిన ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. 

ఇదిలావుంటే, ఇంటింటి సర్వే చేపట్టిన ఆశా వర్కర్లపై గురువారం ఓ వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దాడి చేశాడు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ లో పాల్గొని వచ్చిన వ్యక్తి ఆ దాడికి పాల్పడినట్లు ఆశా వర్కర్లు చెప్పారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారి కోసం ఆశా వర్కర్లు ఈ సర్వే చేపట్టారు. తాము ప్రాణాలకు తెగించి సర్వే నిర్వహిస్తుంటే తమపై దాడి చేస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు పోలీసు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 

ఇదిలావుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా కరోనా వైరస్ కు దూరంగా ఉన్నట్లు భావించారు. కానీ, అకస్మాత్తుగా 23 మంది కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నట్లు తేలింది. దీంతో వారిని, వారి కుటుంబాలకు చెందిన 93 మందిని క్వారంటైన్ కు తరలించారు 

కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లి వచ్చినవారేనని తెలుస్తోంది. దాంతో వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తమై శానిటైజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్ అలర్డ్ ప్రకటించారు.  

click me!