ఐజలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు: తెలంగాణలో పెరుగుతున్న సంఖ్య

By telugu teamFirst Published Apr 6, 2020, 2:39 PM IST
Highlights

గద్వాల జిల్లాలోని ఐజ మండల కేంద్రంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఆ నలుగురు కరోనా వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులను కూాడా క్వారంటైన్ చేసినట్లు డీఎంహెచ్ఓ చెప్పారు.

గద్వాల: తెలంగాణలోని గద్వాల జిల్లాలో గల ఐజలో తాజాగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి (డీఎంహెచ్ఓ) చెప్పారు. ఆ నలుగురి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కు పంపించినట్లు తెలిపారు. ఐజ మొత్తం శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వణికిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ నగరంలోనే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

కామారెడ్డిలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 43 మందికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పరీక్షలకు పంపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. బాన్సువాడలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోద్యయాయి.

తెలంగాణలో ఇప్పటి వరకు 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన 297 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లోని ఎంజీఎం నుంచి వారిని గాంధీకి తరలించారు. ఎంజీఎంలో చికిత్స అందించిన నలుగురు పీజీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపించారు.  

వరంగల్ లో ఢిల్లీ వెళ్లని ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరుకుంది. 

click me!