లాక్‌డౌన్ ఉల్లంఘన: యువకుడిని చావబాది, మూత్రం తాగించిన పోలీసులు

By Siva KodatiFirst Published Mar 31, 2020, 7:31 PM IST
Highlights

తొలి రెండు రోజుల్లో సహనం వహించిన పోలీసులు తర్వాతి నుంచి లాఠీలకు పని చెబుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు బాదేస్తున్నారు. అలా అక్కడక్కడా పోలీసుల ఓవరాక్షన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లను దాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

అయినప్పటికీ కొందరు మాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజుల్లో సహనం వహించిన పోలీసులు తర్వాతి నుంచి లాఠీలకు పని చెబుతున్నారు.

దొరికిన వారిని దొరికినట్లు బాదేస్తున్నారు. అలా అక్కడక్కడా పోలీసుల ఓవరాక్షన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో బయటకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో పాటు మూత్రం తాగించినట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపాయి.

Also Read:24 గంటల్లో దేశంలో 227 పాజిటివ్ కేసులు, మొత్తం కేసులు 1251కి చేరిక

వివరాల్లోకి వెళితే.. నగరంలోని హింద్‌పిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడిని చుట్టుముట్టిన పోలీసులు అతడిని చితక్కొట్టారు. తనను కొట్టవద్దని యువకుడు ప్రాధేయపడుతున్నా వినిపించుకోని ఖాఖీలు ఆ యువకుడిని లాఠీలతో చావబాదారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం సెన్సేషన్ అయ్యింది. యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హింద్‌పిరి ఎస్‌హెచ్‌వోను సస్పెండ్ చేశారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని రాంచీ ఎస్‌పీ తెలిపారు. మరోవైపు రాంచీలో మంగళవారం తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది.

Also Read:డ్యూటీయే ప్రాణం.. పై అధికారులు వద్దంటున్నా: 450 కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్

మలేషియాకు చెందిన ఓ మహిళను కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆ మహిళను ఐసోలేషన్‌కు తరలించామని తెలిపారు. ఇప్పటి వరకు జార్ఖండ్‌లో నమోదైన తొలి పాజిటివ్ కేసు ఇదే కావడం గమనార్హం.

కాగా భారతదేశంలో ఇప్పటి వరకు 1251 మందికి కరోనా సోకగా, 32 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ సోకిన వారిలో 102 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 227 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య పరికరాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

click me!