దేశానికి నిజాముద్దీన్ గండం.. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారి ఆచూకీ కోసం...

By telugu news teamFirst Published Apr 1, 2020, 9:24 AM IST
Highlights

ఈ సమయంలో వివిధ దేశాల నుంచి ఆ దర్గాకు వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్‌ అప్పటికే సోకినట్లు తెలుస్తోంది. ఆ విషయం అప్పట్లో ఎవరికీ తెలియక పోవడంతో అందరూ సన్నిహితంగా కలిసి మెలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినపడుతోంది.  ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఢిల్లీ దడ పట్టుకుంది.

Also Read డిల్లీలో కరోనా కలకలం... మర్కజ్ నిజాముద్దిన్ పెద్దలపై చర్యలు...
 
ఇప్పటికే అక్కడికి వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకినట్లు నిర్థారణ కాగా... ఆ మసీదుకి వచ్చిన మిగితా వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ మర్కజ్‌ అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచింది. ఏటా మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మర్కజ్‌కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 14, 15వ తేదీల్లో మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రార్థనల కోసం వెళ్లారు. 

ఈ సమయంలో వివిధ దేశాల నుంచి ఆ దర్గాకు వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్‌ అప్పటికే సోకినట్లు తెలుస్తోంది. ఆ విషయం అప్పట్లో ఎవరికీ తెలియక పోవడంతో అందరూ సన్నిహితంగా కలిసి మెలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆ విషయం తెలియకుండానే తిరిగి వారు మార్చి 17న స్వస్థలాలకు చేరుకున్నారు. 14 రోజుల అనంతరం ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలియడంతో అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో ఆందోళనతో పాటు అప్రమత్తతా పెరిగింది. 

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల కోసం తెలుగు రాష్ట్రాల్లో జల్లెడ పడుతున్నారు.  వారు ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో తిరిగారు.. ఎంత మందిని కలిశారు.. ఎక్కడ బస చేశారు.. ఏ రైలు, బస్సు, విమానాల్లో ప్రయాణించారు.. వంటి వివరాల కోసం ఆరా మొదలుపెట్టారు. అంతేకాకుండా... ఇంక ఎంత మంది ఢిల్లీ వెళ్లి వచ్చారు అనే విషయంపై కూడా అధికారులు దృష్టిసారించారు.

click me!