వలస కార్మికుల ఇళ్లకు నీళ్లు, విద్యుత్ నిలిపివేత: ఢిల్లీపై యూపీ సర్కార్ విమర్శలు

By narsimha lodeFirst Published Mar 29, 2020, 3:44 PM IST
Highlights

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై యూపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో  ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. 


న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై యూపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో  ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. వలస కార్మికులను జీవితాలను ఫణంగా పెట్టి రాజకీయాలను చేస్తోందని యూపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది.

లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీ అధికారులు నీరు, విద్యుత్ కనెక్షన్లను వలస కార్మికులు ఉంటున్న ఇళ్లకు  నిలిపివేశారని యూపీ అధికారులు చెబుతున్నారు. వలస కార్మికులకు కనీసం పాలు కూడ సరఫరా చేయడం లేదన్నారు. వలస కార్మికులను యూపీ రాష్ట్ర సరిహద్దు వరకు తీసుకొచ్చి వారిని వదిలి వెళ్లారని యూపీ ప్రభుత్వ వర్గాలు ఆరోపణలు చేశాయి.

యూపీ రాష్ట్ర సరిహద్దుల వద్ద తమ స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బస్సులు ఉన్నాయని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పుకార్లను వ్యాప్తి చేసిందని యూపీ అధికారులు ఆరోపించారు. ఈ బస్సుల్లో తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉందని వలస కార్మికులు వెళ్లొచ్చని భ్రమలు కల్పించారని వారు ఆరోపించారు.

బీహార్, ఢిల్లీ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులను తమ రాష్ట్రంలోని స్వగ్రామాలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు.

ఢిల్లీ నుండి వచ్చి యూపీ సరిహద్దుల్లో ఉన్న  వలస కార్మికులను తమ గ్రామాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. అర్ధరాత్రి రవాణా శాఖకు చెందిన బస్సుల డ్రైవర్లు, కండక్టర్లను పిలిపించినట్టుగా అధికార వర్గాలు ప్రకటించాయి.

సరిహద్దుల్లో ఉన్న  కార్మికులను స్వగ్రామాలకు తరలించేందుకు గాను వెయ్యి బస్సులను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.సరిహద్దుల్లో ఉన్న కార్మికులకు ఆహారం, మంచినీళ్లు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.శనివారం నాడు సీనియర్ పోలీస్ అధికారులు లక్నోలోని ఛార్ బాగ్ బస్ స్టేషన్ వద్దకు చేరుకొని వలస కూలీలకు ఆహారం, నీళ్లు అందించారు.

also read:లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

ఈ బస్ స్టేషన్ నుండి కాన్పూర్, బాలియా, వారణాసి, గోరఖ్ పూర్, అజంఘర్, ఫైజాబాద్, బస్తీ, ప్రతాప్ ఘర్, సుల్తాన్ పూర్, ఆమేథీ, రాయ్ బరేలీ, గోండా, ఎటావా తదితర ప్రాంతాలకు వెళ్లాయి 

వలసకూలీలను తమ స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హితేస్ అవస్తీ, లక్నో పోలీస్ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. 
 

click me!